దసరా పండుగ సమీపిస్తే మార్కెట్లో ఉత్సాహం మరింత పెరుగుతుంది. సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్ ఆఫర్లు, క్యాష్బ్యాక్లు, బంపర్ డ్రాలు నిర్వహిస్తుంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ప్రత్యేకమైన స్కీములు ప్రవేశపెడుతున్నారు. ఈసారి సూర్యాపేటలోని జానీ చికెన్ అండ్ మటన్ సెంటర్ వినూత్నంగా ముందుకు వచ్చింది. కస్టమర్ల రద్దీ తగ్గడంతో యజమాని నాగరాజు కొత్త ఆలోచనతో లక్కీ డ్రా ప్రకటించారు.
ఈ స్కీంలో పాల్గొనాలంటే కేవలం రూ.150 విలువైన కూపన్ కొనాలి. ఈ కూపన్ తీసుకున్న వారు దసరా పండుగకు ముందురోజు జరిగే డ్రాలో భాగం అవుతారు. విజేతలకు అందించే బహుమతుల జాబితా ఆసక్తికరంగా ఉండటంతో ప్రాంతంలో ఇది చర్చనీయాంశమైంది. మొదటి బహుమతిగా 15 కిలోల బరువున్న గొర్రెపోతు, అదనంగా బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్ను ఇవ్వనున్నారు. రెండవ బహుమతిగా కూడా బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్ కేటాయించారు. విజేతల పేర్లను ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఫ్లెక్సీల ద్వారా ప్రకటిస్తామని యజమాని తెలిపారు.
కేవలం వంద మందికి మాత్రమే అవకాశం ఇవ్వడం వల్ల టికెట్ల కోసం ప్రజలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఎక్కువ భాగం కూపన్లు అమ్ముడయ్యాయని సమాచారం. స్థానికులు ఈ ప్రయత్నాన్ని వినూత్నంగా భావిస్తూ ‘పండుగ వాతావరణంలో వినోదం.. బహుమతుల రూపంలో లాభం అంటూ చర్చించుకుంటున్నారు. ఈ లక్కీ డ్రాను దసరా పండగ ఒక్క రోజు ముందు అంటే అక్టోబర్ 1వ తేదీన తీయనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి డ్రాలు నిర్వహించడం కొత్త కాదు. గతంలో కూడా పలు బార్లు, హోటళ్లలో చిన్న చిన్న గిఫ్టులు ఇవ్వడం జరిగేదే. కానీ మాంసం, మద్యం కలిపిన ప్యాకేజీని బహుమతులుగా ఇవ్వడం వినూత్నంగా ఉంది. పండుగ సమయంలో వ్యాపారం పెంచుకోవడమే కాకుండా.. వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడం లక్ష్యంగా ఉందని యజమాని చెబుతున్నారు. ఈ లక్కీ డ్రా విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని వ్యాపారులు ఇలాంటి ఆఫర్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa