ప్రతీ కలను నిజం చేసుకోవడం కోసం కృషి, క్రమశిక్షణ, తపన మాత్రమే కాకుండా ఓర్పు కూడా అవసరం. మహబూబ్నగర్ జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన మండల కవిత జీవితమే అందరికీ ఆదర్శం. సాధారణ కుటుంబంలో జన్మించి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ గెలుపు సాధించడం ఎంత కష్టమో ఆమె చూపించింది. తండ్రి నాగన్న డ్రైవర్గా కష్టాలు పడుతుండగా.. తల్లి భారతమ్మ వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించారు. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనూ కవిత చదువుపై మక్కువ చూపి చిన్ననాటి నుంచే ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుంది.
పరిస్థితులు అనుకూలంగా లేని వేళల్లోనూ క్రమశిక్షణతో శ్రమించి విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరడం ఆమె మొదటి విజయం. అయితే ఆమె అక్కడే ఆగిపోకుండా ఇంకా ఉన్నతస్థాయిని చేరుకోవాలని సంకల్పించి గ్రూప్-1 కోసం సుదీర్ఘంగా చదువుకుంది. రేయింబవళ్ళు అటు ఉద్యోగం చేసుకుంటూనే ప్రిపరేషన్ మొదలు పెట్టారు. రోజుకు 6 నుంచి 8 గంటల పాటు చదవడం.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా క్రమపద్ధతిలో కృషి చేయడం ఆమె సాధనలో ప్రధాన పాత్ర పోషించాయి. ఫలితంగా ప్రతిష్ఠాత్మక గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ హోదాను సంపాదించింది.
కవిత విజయం కేవలం వ్యక్తిగతం కాదు.. ఆ గ్రామానికి గౌరవం తీసుకొచ్చింది. గ్రామస్థులు, రేవల్లి మండల ప్రజలు ఆమెను హృదయపూర్వకంగా అభినందించారు. కవిత పట్టుదలతో సాధించిన ఈ విజయం అనేక మంది యువతకు స్ఫూర్తి నిలిచింది. సవాళ్లను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని చేరుకోవాలని భావించే ప్రతి అభ్యర్థి ఆమె కథనంలో ధైర్యాన్ని పొందగలరు.
పట్టుదలతో కృషి చేస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అధిగమించి కలలను సాకారం చేసుకోవచ్చని కవిత నిరూపించింది. ఆమె జీవితం నిరుత్సాహపడే వారికి ఒక ప్రేరణ. విజయమంటే అదృష్టం కాదు.. శ్రమను అంకితం చేసే వారికి లభించే ప్రతిఫలం అని ఆమె చూపించింది.
ఇదిలా ఉండగా.. గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 27వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మొట్ట మొదటి గ్రూప్ 1 ఎన్నో అడ్డంకులను దాటుకొని.. కోర్టు కేసులను అధిగమించి విజయతీరాలకు చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa