తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం తీసుకొచ్చిన సెంట్రల్ డ్రాఫ్ట్ సీడ్స్ బిల్లు-2025పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రీకరించేలా ఈ బిల్లు రూపొందడం సరికాదని, ఇది రాష్ట్రాల సమాఖ్య విధానానికే విరుద్ధమని ఆయన మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విత్తనాల సర్టిఫికేషన్ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని మంత్రి డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల అక్రమ రవాణా, అమ్మకాలను అరికట్టాలంటే రాష్ట్రాలకు పూర్తి అధికారాలు ఉండాల్సిందేనని, లేకపోతే రైతులను రక్షించడం అసాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లులో పంట నష్టం జరిగినప్పుడు పరిహారం ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ముసాయిదా బిల్లుకు గట్టి అభ్యంతరాలు, సవరణల సూచనలు పంపేందుకు అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, జిల్లాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించి, వాటినీ కేంద్రానికి పంపాలని ఆదేశించారు. రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలతోనే బిల్లు సవరణలు రావాలని ఆయన స్పష్టం చేశారు.
“తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులపై రాజీ ఉండదు. ఈ విత్తన బిల్లుకు మా అభ్యంతరాలను బలంగా తెలియజేస్తాం” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa