పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళల్లో క్షుద్రపూజలు నిర్వహిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లేడు, మోతుకు, బొమ్మిడి ఆకులతో తయారు చేసిన విస్తరాకుల్లో పసుపు, కుంకుమలు అద్దిన అన్నం ముద్దలు, నిమ్మకాయలు, కోడిగుడ్లను ఉంచి రోడ్ల కూడళ్ల వద్ద వదిలివేస్తున్నారు. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్లే దారిలోనే ఈ ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడంతో, ఉదయాన్నే పనులకు వెళ్లే రైతులు వీటిని చూసి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
సాధారణంగా ఆదివారం, గురువారం రాత్రి సమయాల్లో ఈ తరహా పూజలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి దిష్టి తీసి, ఆ పదార్థాలను రహదారుల మీద, పొలాల గట్ల మీద పెడుతున్నట్లు అనుమానిస్తున్నారు. తమ పొలాల వద్ద ఇలాంటి క్షుద్ర శక్తుల ఆవాహనలు చేయడం వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుందని లేదా తమకు ఏదైనా కీడు జరుగుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ భయం కారణంగా చాలామంది వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం ఎంతో ముందుకు దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మడం పట్ల మేధావులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు స్పందిస్తూ, క్షుద్రపూజల పేరుతో చేసే పనులకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని తేల్చి చెప్పారు. రోడ్లపై ఉంచే నిమ్మకాయలు, కోడిగుడ్ల వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగదని, ప్రజలు అనవసరంగా భయపడి మానసిక ఆందోళన చెందవద్దని వారు హితవు పలుకుతున్నారు.
గ్రామాల్లోని అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి మూఢాచారాలకు స్వస్తి పలకాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. అనారోగ్యం ఉంటే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి తప్ప, ఇలా రోడ్లపై పూజలు చేయడం వల్ల ఫలితం ఉండదని వారు సూచిస్తున్నారు. స్థానిక పోలీసులు, అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి, ఇలాంటి పనులకు పాల్పడే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలని, తద్వారా రైతుల భయాన్ని పోగొట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa