తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. గతంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని.. దాని వల్ల పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే రిటైర్డ్ అధికారుల కమిటీతో జిల్లాల సరిహద్దులను సవరిస్తామని సీఎం చెప్పారు. ఈ క్రమంలో జనగామ జిల్లాను రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జనగామ జిల్లాను రద్దు చేస్తే.. జిల్లా అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు.
గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలను చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వాటన్నింటి కలిపి మళ్లీ వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు నాయుని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న జిల్లాను రద్దు చేస్తామంటే.. ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు.
'మీ హామీ ఏమైంది..'
ఈ సందర్భంగా కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరును పెడతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని.. కానీ ఇప్పుడు ఏకంగా జిల్లానే లేకుండా చేయాలని ఆ పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు. ఇక జనగామ జిల్లాను రద్దు చేయాలని చూస్తే ప్రభుత్వమే మూత పడుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా జనగామ జిల్లాను వరంగల్ కమిషనరేట్ పరిధి నుంచి తొలగించి.. ప్రత్యేకంగా ఒక ఎస్పీని కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇటీవల కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. జనగామ జిల్లా విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు అపోహలు సృష్టిస్తున్నారని.. జిల్లాను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజనలో అనేక లోపాలు ఉన్నాయని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గతంలో కేవలం నాలుగు లేదా ఐదు మండలాలతో కొన్ని జిల్లాలను ఏర్పాటు చేశారని.. దీనివల్ల పరిపాలన పరంగా అధికారుల కొరత, జోనల్ వ్యవస్థలో సమస్యలు, స్థానికులకు దూరభారం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి చెబుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల సవరణపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం త్వరలో రిటైర్డ్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించనుంది. ఈ కమిటీ ప్రజల అభ్యంతరాలను.. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదిక సమర్పించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa