తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారమయ్యాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు. కవిత కాంగ్రెస్ లోకి వస్తారనే ప్రచారం కేవలం రాజకీయ గందరగోళం సృష్టించేందుకేనని.. అలాంటి ఆలోచన పార్టీకి లేదని ఆయన తేల్చి చెప్పారు. గత పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలకు భారత రాష్ట్ర సమితి నేతలే బాధ్యత వహించాలని... ప్రజలు వారిని ఏనాడో తిరస్కరించారని గుర్తు చేశారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. దేవుళ్ల పేరును వాడుకుంటూ బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని.. మతాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని హితవు పలికారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కవిత రాజకీయంగా కొంత సైలెంట్ అయ్యారు. అయితే.. ఆమె తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పార్టీ మార్పు వార్తలు రావడం గమనార్హం. అంతే కాకుండా.. ఇటీవల కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయాల కంటే ముందుగా తనపై ఉన్న విమర్శలను తిప్పికొట్టడమే ఆమె ప్రాధాన్యతగా కనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబం నుంచి కవిత లేదా కేటీఆర్ వైఖరి మారితే అది పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే కాంగ్రెస్ నేతలు ఆమె చేరికను ఖండిస్తూనే.. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని చేర్చుకోవడం ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ భావిస్తోంది.
అందుకే హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కవిత, కాంగ్రెస్ మధ్య ఏదో ఒప్పందం కుదిరిందనే ఆరోపణలను బీజేపీ నేతలు తరచుగా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మహేశ్ కుమార్ గౌడ్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. తాము ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన చెప్పకనే చెప్పారు. ప్రస్తుతానికి కవిత కాంగ్రెస్ చేరిక వార్తలకు ముగింపు పడినా.. రాబోయే రోజుల్లో సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa