ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రైతులకు లోటు లేకుండా ఎరువులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 09:02 PM

తెలంగాణ రైతులకు ఎటువంటి లోటు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎరువుల సరఫరా చేపట్టిందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. శుక్రవారం (ఫిబ్రవరి 6) లోక్‌సభలో బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు, కాంగ్రెస్‌ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం టోకెన్‌ విధానం ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందించిందని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువుల పంపిణీలో ఇబ్బందులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం యూరియా బుకింగ్‌ యాప్‌ను రూపొందించిందన్నారు. ఈ యాప్ ద్వారా అన్నదాతలు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి నుంచే ఎరువులను ముందుగా బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. రైతులకు అందించే ఎరువులపై కేంద్రం 2024-25లో రూ.1.77 లక్షల కోట్ల సబ్సిడీ భరించినట్లు వెల్లడించారు.


ఇక తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్న 28 మంది న్యాయమూర్తుల్లో ఏడుగురు అంటే 25 శాంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 14.25 శాతం మహిళా న్యాయమూర్తుల సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని అన్నారు. అత్యధికంగా హర్యానా, పంజాబ్ హైకోర్టులో 18 శాతం మంది మహిళా న్యాయమూర్తులు, బాంబే హైకోర్టులో 12 శాతం మంది, ఢిల్లీ, మద్రాస్‌ హైకోర్టుల్లో 10 మంది, కర్ణాటకలో 9 మంది, కోల్‌కతాలో 8 మంది, తెలంగాణ, అలహాబాద్, గుజరాత్ హైకోర్టుల్లో ఏడుగురు చొప్పున మహిళా న్యాయమూర్తులు ప్రస్తుతం సేవలందిస్తున్నరని వెల్లడించారు.


ఇక తెలంగాణలో 2014-24 మధ్య పదేళ్ల కాలంలో 4,76,428 క్యాన్సర్‌ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ లోక్‌సభలో తెలిపారు. రాష్ట్రంలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 51 బోధనా సిబ్బంది పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్నారు. మొత్తం 183 బోధనా సిబ్బందికి గాను 132 మంది అంటే 72.13 శాతం మంది పనిచేస్తున్నారని చెప్పారు. మరో 27.86 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa