ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజూ అప్పర్‌సర్క్యూట్ కొడుతున్న స్టాక్.. వారికి కాసుల పంట.. నెలలోనే రూ. 1000కిపైగా పెరిగిన షేరు

business |  Suryaa Desk  | Published : Wed, May 15, 2024, 09:54 PM

 దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడవుతున్నాయి. ఒక సెషన్లో లాభాలొస్తే.. మరో సెషన్లో నష్టాలొస్తున్నాయి. అయితే ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం, ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయి గరిష్టాల నుంచి దిగొస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. బుధవారం రోజు సెన్సెక్స్, నిఫ్టీ పడిపోయాయి. ఇవాళ సెషన్‌లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 118 పాయింట్లు కోల్పోయి 72,987 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 17 పాయింట్ల పతనంతో 22 వేల 200 మార్కు వద్ద ముగిసింది. అయితే మార్కెట్లు నష్టపోయినప్పటికీ.. ఒక స్టాక్ మాత్రం అప్పర్ సర్క్యూట్లు కొడుతూనే ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


అదే శక్తి పంప్స్ (ఇండియా) లిమిటెడ్. ఇది దేశంలో సోలార్ పంప్స్ అండ్ మోటార్స్ తయారీదారుల్లో అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఎన్నో సానుకూల సంకేతాల నడుమ గత కొద్ది రోజులుగా ఈ స్టాక్ పుంజకుంటూనే ఉంది. ముఖ్యంగా 2023-24 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో అదిరిపోయే పెర్ఫామెన్స్ చేయడం సహా ఆర్డర్లు విపరీతంగా రావడం వల్ల స్టాక్ పెరుగుతూనే ఉంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌వైపు మొగ్గచూపుతున్నారు.


ఇవాళ్టి ట్రేడింగ్ సెషన్లో కూడా ఈ స్టాక్ ఇంట్రాడేలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. ఈ క్రమంలోనే స్టాక్ ఆల్ టైమ్ గరిష్టం రూ. 2493.60 వద్ద నమోదు చేసింది. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో 4 శాతం లాభంతో రూ. 2465 వద్ద సెషన్ ముగించింది. గత 5 రోజుల్లో చూసినట్లయితే 17 శాతానికిపైగా పెరిగింది. ఈ క్రమంలో ఒక్కో షేరుపై రూ. 365 పెరగడం విశేషం. నెల రోజుల్లో చూసుకుంటే దాదాపు అన్ని సెషన్లు సానుకూలంగానే కదలాడింది.


నెల వ్యవధిలో ఏకంగా 70 శాతం స్టాక్ పెరగ్గా.. ఇక్కడ ఒక్కో షేరుపై రూ. 1015 పెరగడం విశేషం. ఇక్కడ నెల కింద ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ. 70 వేల ప్రాఫిట్ వచ్చిందన్నమాట. 6 నెలల్లో అయితే 135 శాతం పెరిగిందీ స్టాక్. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూసినా కూడా నాలుగున్నర నెలల్లో 140 శాతం పెరిగింది.


ఏడాది వ్యవధిలో అంటే గతేడాది ఇదే సమయం నుంచి చూస్తే 400 శాతానికిపైగా పుంజుకుంది. ఇక్కడ షేరు ధర రూ. 1981 పెరిగింది. లక్ష పెట్టుబడిని ఇక్కడ రూ. 5 లక్షలు చేయడం విశేషం. ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 4.92 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ట విలువరూ. 422.55 గా ఉంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ స్టాక్ రానున్న రోజుల్లో కూడా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.


ఏప్రిల్ 27న ఈ కంపెనీ Q4 ఫలితాల్ని వెల్లడించింది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం టాక్స్ తీసేస్తే.. రూ. 89.70 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇది కేవలం రూ. 2.2 కోట్లుగానే ఉందంటే ఎంత శాతం పెరిగిందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆదాయం మూడింతలు పెరిగి రూ. 609.3 కోట్లకు చేరింది. ఈ క్రమంలోనే ఎన్నో ఆర్డర్లు ఈ కంపెనీకి వచ్చాయి. దీంతో షేరు పెరుగుతూనే ఉంది. ఇన్వెస్టర్లు లాభాలు అందుకుంటూనే ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa