బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అక్కడి హిందువులపై జరుగుతున్న హింసను ఆపేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కృషి చేయాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే తాజాగా బంగ్లాదేశీ హిందువులపై జరుగుతున్న దాడులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేత సునీల్ అంబేకర్ స్పందించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మాట వినకపోతే.. మరో మార్గాన్ని వెతకాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్కు కీలక సూచనలు చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను కేవలం చర్చలు, సంప్రదింపులతోనే పరిష్కారం చేయలేమని ఆర్స్సెస్ నేత సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిర్వహించిన సకల హిందూ సమాజ్ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసి.. కచ్చితమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అయితే చర్చలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని తాను ఆశిస్తున్నానని.. ఒకవేళ అలా జరగకపోతే మరో పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మహ్మద్ యూనస్.. నడుపుతున్న బంగ్లాదేశ్లో ప్రస్తుతం శాంతి లేదని సునీల్ అంబేకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
బంగ్లాదేశ్లో హిందువులు సహా ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలిపారు. ఇటీవల ఢాకా వెళ్లిన విక్రమ్ మిస్రీ.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మహమ్మద్ జషీమ్ ఉద్దీన్తో భేటీ అయ్యారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్న మహమ్మద్ యూనస్తోనూ విక్రమ్ మిస్రీ సమావేశం అయ్యారు.
అయితే ఈ సమావేశం తర్వాతి రోజే.. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా రాజీనామా చేసి, పారిపోయినప్పటి నుంచి.. అంటే ఆగస్ట్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదే మధ్య కాలంలో హిందువులు సహా బంగ్లాదేశ్లోని మైనారిటీలపై మతపరంగా 88 హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసుల్లో ఇప్పటివరకు 70 మందిని అరెస్ట్ చేసినట్లు ఆ రిపోర్ట్ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa