గన్నవరంలోని టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన 33 మందికి చుక్కెదురైంది. హైకోర్టు నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ కేసులో 33 మంది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ట్రయల్ కోర్టుకే వెళ్లాలని ఆదేశిస్తూ, పిటిషన్ కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని జనవరి 28న తోట వెంకటేశ్వరావుతోపాటు మరో 32 మంది సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహ తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ట్రయల్ కోర్టు అందుబాటులో ఉండగా హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ఈలోపు ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హాజరయ్యారు.