ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అంతుచిక్కని వ్యాధితో పౌల్ట్రీ కోళ్లు చనిపోతున్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోతూ ఉండటంతో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. ఈ కోళ్ల మరణాలు గతేడాది డిసెంబర్ నుంచి మొదలైనట్లు పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. డిసెంబర్లో వైరస్ వ్యాప్తి మొదలైందని.. జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత తీవ్రమైందని రైతులు చెప్తున్నారు. అప్పటి వరకూ ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు.. గంటల వ్యవధిలోనే చనిపోతున్నాయని వాపోతున్నారు. వ్యాక్సిన్ వేస్తున్నా ఉపయోగం లేదని.. అంతుచిక్కని వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కోళ్లలో హెచ్15ఎన్ వైరస్ లక్షణాలు ఉన్నట్లు స్థానిక వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు రైతులు చెప్తున్నారు. గతంలో 2012, 2020 సంవత్సరాల్లో ఇదే తరహాలో వైరస్ వ్యాప్తి చెంది కోళ్లు లక్షల్లో చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే అప్పటితో పోలిస్తే ఈసారి వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తికి కారణాలు స్పష్టంగా తెలియకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన కోళ్ల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం ఇప్పటికే భోపాల్ పంపారు. భోపాల్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత కోళ్ల మరణాలకు గల కారణాలు తెలియనున్నాయి.
మరోవైపు పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఇదే తరహా ఘటనలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో అంతుచిక్కని వైరస్ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఉప్పయ్య అనే పౌల్ట్రీ రైతు.. కోళ్ల ఫారంలో ఈ ఘటన జరిగింది. అంతుచిక్కని వైరస్ కారణంగా కోళ్లఫారమ్లోని 3000 బ్రాయిలర్ కోళ్లు చనిపోయాయని రైతు చెప్తున్నారు. అలాగే కొత్త కారాయగూడెంలోని నాగేశ్వరరావు అనే రైతు కోళ్లఫారంలోనూ మూడు వేల కోళ్లు చనిపోయినట్లు తెలిసింది. దీంతో స్థానిక వెటర్నరీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ వెటర్నరీ పరిశోధన బృందానికి కోళ్ల మరణాలపై సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బృందం కోళ్ల నుంచి నమూనాలను సేకరించింది.