గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదుచేసింది. వర్సిటీకి ‘ఏ++ గుర్తింపు’ పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో సీబీఐ రంగంలోకి దిగింది. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, తీసుకున్న న్యాక్ సభ్యులపైనా కేసు బుక్ చేసి... మొత్తం ఇందులో 14 మందిని నిందితులుగా చేర్చింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఛైర్మన్, ఇతర ప్రతినిధులతోపాటు న్యాక్ తనిఖీ బృందంలోని 10 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో 10 మందిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేసింది.
కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులతోపాటు, దేశంలోని ప్రముఖ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లూ ఉండటం సంచలనం రేపుతోంది. ఢిల్లీ, విశాఖ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందాలు విజయవాడలోని కేఎల్యూ అడ్మినిస్ట్రేషన్ భవనం, వడ్డేశ్వరం క్యాంపస్లో సోదాలు నిర్వహించింది. శనివారం రాత్రి 10 గంటల తర్వాత కూడా తనిఖీలు కొనసాగించింది. ‘ఏ++’ రేటింగ్ కోసం నగదు, బంగారం, ల్యాప్టాప్లు, సెల్ఫోన్ల రూపంలో న్యాక్ బృందానికి కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం లంచాలు ఇచ్చినట్లు సీబీఐకి ఫిర్యాదులు అందాయి.
దీనిపై స్పందించిన సీబీఐ కేసు నమోదు చేసింది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, సంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధనగర్, ఢిల్లీ సహా 20 చోట్ల న్యాక్ సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. వారి వద్ద నుంచి రూ.37 లక్షల నగదు, 6 ల్యాప్టాప్లు, ఐఫోన్ 16ప్రో స్వాధీనం చేసుకుంది. సీబీఐ అరెస్ట్ చేసినవారిలో కేఎల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజ హరీన్, వైస్ ఛాన్సలర్ జీ.పి.సారథి వర్మ, హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ ఉన్నారు.
ఇక, న్యాక్ బృందంలో అరెస్టైనవారిలో ఛైర్మన్, రామచంద్ర చంద్రవంశీ యూనివర్సిటీ వీసీ సమరేంద్రనాథ్ సాహా, న్యాక్ బృందం సమన్వయకర్త, ఢిల్లీ జేఎన్యూ ప్రొఫెసర్ రాజీవ్ సిజిరియా, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా (బీఐఎల్) డీన్ డాక్టర్ డి.గోపాల్, భోపాల్లోని జగ్రాన్ లేక్ సిటీ యూనివర్సిటీ డీన్ రాజేశ్ సింగ్ పవర్, జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మాసన్ కుమార్ మిశ్రా, దేవనగరి యూనివర్సిటీ ప్రొఫెసర్ గాయత్రి దేవరాజ, సంబల్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బులు మహారాణా ఉన్నారు.
కేఎల్ఈఎఫ్ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ, న్యాక్ మాజీ డిప్యూటీ సలహాదారు డాక్టర్ ఎల్. మంజునాథరావు, బెంగళూరు యూనివర్సిటీ డైరెక్టర్ ఎం.హనుమంతప్ప, న్యాక్ సలహాదారు ఎం.శ్యామ్సుందర్ అరెస్ట్ కాగా.. వీరు కాకుండా పలువురు నిందితులుగా ఉన్నారు.