తమిళనాడులోని కోయంబత్తూరులో నివాసం ఉంటూ.. అక్కడే ఓ దుస్తుల కంపెనీలో పని చేస్తోందో మహిళ. అయితే ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి. అయితే తన వ్యక్తిగత పనుల నిమిత్తం సదరు మహిళ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి వెళ్లాలనుకుంది. ఈక్రమంలోనే గురువారం రోజు రాత్రి రైలు ఎక్కి ఒంటరిగా ప్రయాణం ప్రారంభించింది. రాత్రంతా బాగానే ఉన్నా శుక్రవారం రోజు వేకువజామున మూత్ర విసర్జన కోసం రైళ్లోని బాత్రూం వైపు వెళ్లింది.
అయితే అప్పటికే ఓ ఇద్దరు వ్యక్తులు సదరు మహిళపై కన్నేశారు. ఆమెను అనుసరిస్తూ.. టాయిలెట్ల వరకూ వెళ్లారు. ఆమె లోపలికి వెళ్లి బయటకు వచ్చేంత వరకూ అక్కడే నిలబడి ఉన్నారు. గర్భిణీ బయటకు వచ్చిన వెంటనే ఆమెపై లైంగిక దాడి చేశారు. ఒకరు నోరు మూయగా మరొకరు.. దాడికి పాల్పడ్డారు. తాను గర్భవతిని అని వదిలేయమంటూ బాధితురాలు నిందితులను వేడుకుంది.
కానీ వారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా.. అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే సదరు మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో ఎక్కడ తోటి ప్రయాణికులకు విషయం తెలుస్తోందనని భయపడ్డ నిందితులు.. వెంటనే ఆమెను రైళ్లో నుంచి కిందకు తోసేశారు. గర్భవతి అని కూడా చూడకుండా బయటకు తోసి వెళ్లిపోయారు. కింద పడిపోయిన గర్భిణీకి తీవ్ర గాయాలు అయ్యాయి. రైలు పట్టాల పక్కన పడిపోయిన మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న జోలార్పేటై పోలీసులు మహిళను వెల్లూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సదరు మహిళకు చేయి, కాలు విరిగిపోయినట్లు గుర్తించారు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగానే ఉందని.. ఎలాంటి ప్రాణాపాయం లేదని వివరించారు. మరోవైపు మహిళపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇప్పటికే కేసులో విచారణ నిమిత్తం హేమరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.