దాయాది పాకిస్థాన్ మరోసారి శాంతి మంత్రం వల్లించింది. కశ్మీర్ అంశం సహా భారత్తో ఉన్న అన్ని సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. కానీ, ఐక్యరాజ్యసమితిలో చేసిన వాగ్దానాలను భారత్ నెరవేర్చి, చర్చలకు ముందుకు రావాలంటూ పసన్నాయినొక్కులు నొక్కింది.
‘కశ్మీర్ సంఘీభావ దినం’ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన నుంచి భారత్ బయటకు రావాలని కోరారు. అయితే, ఐరాసకు చేసిన వాగ్దానం నేరవేర్చుతూ కశ్మీర్ సహా అన్ని సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని షెహబాజ్ అన్నారు. పరోక్షంగా భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దును పాక్ ప్రధాని ప్రస్తావించడం గమనార్హం.
‘కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికార హక్కు లభించే వరకు పాకిస్థాన్ దృఢమైన నైతిక, దౌత్య, రాజకీయ మద్దతును అందిస్తూనే ఉంటుంది’ అని ఆయన అన్నారు, ‘కశ్మీర్ సమస్యకు ఏకైక పరిష్కారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ప్రకారం స్వయం నిర్ణయాధికార హక్కు మాత్రమే’ అని కూడా ఆయన తెలిపారు.
మరోవైపు, కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని భారత్ పునరుద్ఘాటిస్తూనే ఉంది. ఈ విషయంలో ఇతరుల జోక్యాన్ని సహించబోమని ఐరాస సహా అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసింది. అంతేకాదు, ఉగ్రవాదరహిత, శాంతియుత వాతావరణంలోనే పాక్తో చర్చలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని భారత్ తేల్చిచెప్పింది. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దుచేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.
1999లో నాటి భారత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్లు లాహోర్ డిక్లరేషన్పై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం చర్చలేనని షరీఫ్ ఈ సందర్బంగా అన్నారు. ఇక, పొరుగు దేశంతో తాము సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నామని భారత్ చెబుతూ వస్తోంది.