జనవరి 29వ తేదీ రోజు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ ఆర్మీ హెలికాప్టర్.. పౌర విమానాన్ని ఢీకొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన వల్ల మొత్తం 67 మంది చనిపోయారు. అయితే తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్మీ హెలికాప్టర్లో కీలకమైన అధునాత సర్వైలెన్స్ సిస్టమ్ ఆఫ్ చేసి ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని నేరుగా టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
పౌర విమానాన్ని ఢీ కొట్టిన ఆర్మీ హెలికాప్టర్లో ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైలెన్స్ వ్యవస్థ ఉందని టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ తెలిపారు. అయితే అది ప్రమాదం సమయంలో ఆఫ్ చేసి ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఇందులో పెద్దగా తప్పు పట్టాల్సిన విషయం ఏమీ లేదని.. అది శిక్షణ కార్యక్రమం కావడంతో ఏడీఎస్-బీ వ్యవస్థను ఆఫ్ చేసి ఉంటారని వివరించారు. దీనికి జాతీయ భద్రతకు సంబంధించిన కోణం ఏమీ లేదన్నారు. అయితే దాని ట్రాన్స్పాండర్ ఆన్లో ఉండడంతో రాడార్లో కనిపించిందని.. అదే ఏడీఎస్-బీ వ్యవస్థ కూడా పని చేసి ఉంటే విమానం వచ్చేది మరింత కచ్చితంగా కనిపించి ఉండేదని వెల్లడించారు.
అయితే ఈ ఏడీఎస్-బీ వ్యవస్థ వల్ల సమీపంలో ఏవైనా విమానాలు ఉంటే.. స్క్రీన్పై కనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్పై నిఘాకు ఈ వ్యవస్థనే వాడుతున్నారు. కానీ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం సమయంలో శిక్షణ నిమిత్తం గాల్లోకి ఎగరడం వల్ల దాన్ని ఆఫ్ చేశారు. అలాగే ఎగరాల్సిన ఎత్తు కంటే మరో 200 అడుగులు ఎక్కువ ఎత్తులోనే ఆర్మీ హెలికాప్టర్ ప్రయాణించిందట. అయితే ఇందుకు గల కారణం ఏంటన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని.. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు.
పీసీఏ ఎయిర్లైన్స్కు చెందిన 5342 విమానాన్ని గాల్లో శిక్షణ నిమిత్తం తిరుగుతున్న సైన్యానికి చెందిన స్కిరోస్కీ హెచ్-60 హెలికాప్టర్ ఢీకొట్టగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఈ రెండు కింద ఉన్న పొటమాక్ నదిలో పడిపోగా.. రెండు విమానాల్లో ఉన్న 67 మంది ప్రాణాలు కోల్పోయారు. విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే స్పందించి పొటమాక్ నది నుంచి మృతదేహాలను బయటకు తీసింది. అలాగే విమానం, హెలికాప్టర్ శకలాలను కూడా వెలికి తీశాయి. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకునేందుకే అధికారులు ఇంకా చర్యలు చేపడుతున్నారు.