ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హాదా ,,,, తేల్చేసిన ఏపీ స్పీకర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 07:13 PM

ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఫిబ్రవరి 28న ఏపీ ప్రభుత్వం బడ్డెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా.. రారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అధిక సమయం దక్కుతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ దూరంగా ఉంటూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా.. రారా అనేది ఆసక్తికరంగా మారింది.


అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదాపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా రాదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే గానీ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వీలు లేదని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ స్పీకర్‌గా చట్టాలు, నిబంధనలను ఫాలో కాకుండా తనకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియమాలు, నిబంధనలు జగన్ తెలుసుకోవాలని అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వారి నియోజకవర్గాలకు సంబంధించిన సమసల్యపై చర్చించాలని సూచించారు.


వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్‌లో కూర్చుని మాట్లాడితే.. అందుకు అసెంబ్లీలో మంత్రులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలని అనడం వింతగా ఉందన్నారు అయ్యన్నపాత్రుడు. దేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చినంత సమయమే తనకూ ఇవ్వాలని వైఎస్ జగన్ అడుగుతున్నారని.. ఏ రూల్‌ ప్రకారం ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. చట్టాలు, నిబంధనలు మార్చి వైఎస్ జగన్‌కు సమయం ఇవ్వలేమని స్పష్టం చేశారు. అలాగే అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చని.. సభకు ఎందుకు రాలేకపోతున్నాననే దానిపై కారణాలు చెప్తూ స్పీకర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉంటుందున్నారు. సరైన కారణం ఉంటేనే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com