ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రియాక్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 07:22 PM

విశ్వక్‌సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 11 మేకలు అంటూ పృథ్వీ చేసిన స్పీచ్‌పై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే, యర్రగొండపాలెం శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్.. పృథ్వీ 11 మేకలు వ్యాఖ్యలపై రియాక్టయ్యారు. చిత్ర వేడుకల్లో నటులు హుందాగా ప్రవర్తించాలని తాటిపర్తి చంద్రశేఖర్ సూచించారు. రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు మంచిది కాదని అన్నారు. ఇప్పుడున్న 11 గొర్రెలే.. రేపు గర్జించే సింహాలవుతాయని.. శత్రువులను చీల్చి చెండాడుతాయని హెచ్చరించారు. వ్యక్తిగత కక్షలతో సినిమా ఇండస్ట్రీని బలి చేయవద్దని సూచించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే సంగతిని అందరూ గుర్తుంచుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే సూచించారు.


మరోవైపు ఆదివారం జరిగిన లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ 150 మేకలు, 11 మేకలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీని ఉద్దేశించే పృథ్వీ ఈ పొలిటికల్ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2019, 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ పృథ్వీ ఈ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాష్‌ట్యాగ్ బాయ్‌కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. మరోవైపు పృథ్వీ వ్యాఖ్యలపై హీరో విశ్వక్‌సేన్ కూడా విచారం వ్యక్తం చేశారు. అప్పుడు తాను వేదిక మీద లేదని.. ఉంటే, మైక్ లాక్కునే వాడినని చెప్పుకొచ్చారు. అందరికీ తాను క్షమాపణలు చెప్తున్నానని.. ఎవరో చేసిన వ్యాఖ్యలకు కష్టపడి తీసిన తన సినిమాను బలి చేయవద్దంటూ విశ్వక్ సేన్ కోరుతున్నారు.


మరోవైపు కమెడియన్ పృథ్వీ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరుఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృథ్వీకి అవకాశం ఇచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో.. పృథ్వీపై ఆరోపణలు రావటంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి వైసీపీకి దూరమైన పృథ్వీ.. 2024 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి దగ్గరయ్యారు. ఎన్నికల సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరుఫున ప్రచారం కూడా చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ పృథ్వీ మాట్లాడారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com