అనకాపల్లి జిల్లా మీదుగా పెద్ద మొత్తంలో రవాణా అవుతున్న గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒడిశా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా అనకాపల్లి జిల్లాలోకి భారీ మొత్తంలో గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పలుచోట్ల వాహనాల తనిఖీ చేపట్టారు. మాకవరపాలెం పోలీసులు పైడిపాల జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంతోపాటు మూడు బైక్లను ఆపి తనిఖీ చేశారు. 250కిపైగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా నర్సీపట్నం, చింతపల్లి, ఒడిశా, జి.మాడుగుల ప్రాంతాలకు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకం వేసి 515 కిలోలు వున్నట్టు నిర్ధారించారు. ఒడిశాలోని గుర్రాల పణుకు గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీకి తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారు. వాహనాలతోపాటు నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మీడియా సమావేశంలో ఏఎస్పీలు దేవప్రసాద్, మోహనరావు, నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |