ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ అధికారి ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 10:58 PM

దేశంలో గత కొన్ని రోజులుగా పని ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. అయితే ప్రైవేటు కంపెనీల్లో ఉండే పని ఒత్తిడి తట్టుకోలేక.. కొందరు ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. అయితే ప్రైవేటులోనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలాంటి వర్క్ ప్రెజర్ కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నట్లు వార్తలు రావడం మరింత దుమారం రేపుతోంది. ఇటీవలె భారత విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి ఇటీవల అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడగా.. తాజాగా వస్తు సేవల పన్ను-జీఎస్టీలో పనిచేసే ఒక అధికారి ప్రాణాలు తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.


ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాకు చెందిన 59 ఏళ్ల సంజయ్ సింగ్.. ఘజియాబాద్‌లో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రోజున సంజయ్ సింగ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. నోయిడాలో తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని 14వ ఫ్లోర్ నుంచి కిందికి దూకారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే ఈ ఘటనతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. విచారణ జరిపి కీలక విషయాలు వెల్లడించారు. సంజయ్ సింగ్‌కు క్యాన్సర్ మహమ్మారి ఉందని.. గత 5 ఏళ్లుగా ఆ వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ కారణంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యారని.. ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


అయితే సంజయ్ సింగ్ భార్య మాత్రం.. పోలీసులు చెబుతున్న దానికి పూర్తి భిన్నంగా చెబుతున్నారు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడడానికి పని ఒత్తిడే కారణం అంటూ సంచలన ఆరోపణలకు తెరతీశారు. సంజయ్ సింగ్ మృతిపై స్పందించిన ఆయన భార్య.. పని ఒత్తిడి కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయారని.. ఈ వ్యవస్థే తన భర్తను బలి తీసుకుందని తీవ్రంగా ఆరోపించారు. తన భర్త మరణానికి క్యాన్సర్‌ కారణం కాదని ఆమె మీడియాకు వెల్లడించారు. అయితే సంజయ్ సింగ్ ఏళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం నిజమేనని పేర్కొన్న ఆమె.. కానీ ఆయన దాని నుంచి ఎప్పుడో బయటికి వచ్చారని తెలిపారు.


తమ బంధువుల్లో ఉన్న ఒక డాక్టర్‌ తన భర్తకు చికిత్స అందించారని.. ప్రస్తుతం క్యాన్సర్ గురించి కూడా తన భర్తకు ఎలాంటి బాధ లేదని వెల్లడించారు. తన భర్త ఎప్పుడూ పని ఒత్తిడికి గురయ్యేవారని.. ఈ విషయం గురించి ఆయన సహోద్యోగులకు కూడా తెలిసే ఉంటాయని పేర్కొన్నారు. పని ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని.. ఈ వ్యవస్థ తన భర్తను బలి తీసుకుందని ఆమె రోదించారు.


ఇటీవల విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఢిల్లీలో ప్రాణాలు తీసుకున్నారు. చాణక్యపురి ఎంఈఏ సొసైటీలో తాను ఉంటున్న బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఆ ఐఎఫ్ఎస్ కొంతకాలంగా తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నారని.. దానికి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ అధికారి మృతికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మొన్న ఐఎఫ్ఎస్ అధికారి, ఇవాళ జీఎస్టీ అధికారి వరుసగా ఆత్మహత్యలు చేసుకున్న వేళ.. పని ఒత్తిడిపై తీవ్ర చర్చ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com