విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అండర్-19 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుని 17 ఏళ్లు అయ్యాయి. 2008లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్.. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇక ఈ టోర్నీలో భారత్ తరఫున విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మనీశ్ పాండేలు ప్రాతినిధ్యం వహించారు. ఆ టోర్నీలో ఆడి.. ఇంకా ఐపీఎల్ ఆడుతున్నది ఈ ముగ్గురే.
అయితే ఈ మ్యాచులో భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ మరొకరు ఉన్నాడు. అతడే తన్మయ్ శ్రీవాస్తవ. ఫైనల్ మ్యాచ్లో వన్ డౌన్లో బ్యాటింగ్కు దిగి 46 పరుగులు చేశాడు తన్మయ్. దీంతో భారత్ 159 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఆ తర్వాత వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 12 పరుగులతో భారత్ విజయం సాధించింది. ఈ టోర్నీ తర్వాత గుర్తింపు పొందిన కోహ్లీ దిగ్గజ ప్లేయర్గా మారిపోయాడు. జడ్డూ కూడా కీలక ప్లేయర్గా ఎదిగాడు. మనీశ్ పాండే కూడా భారత్ తరఫున కొన్ని మ్యాచులు ఆడాడు.
అయితే ఫైనల్లో టాప్ స్కోరర్గా నిలిచిన తన్మయ్ కూడా.. ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కింగ్స్ లెవన్ పంజాబ్, డెక్కన్ చార్జర్స్, కోచీ టస్కర్స్ కేరళ తరపున ఆడాడు. అయితే ఆశించిన మేర రాణించలేక.. గుర్తింపు పొందలేకపోయాడు. దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరఫున 90 మ్యాచులు ఆడి, 4900కిపైగా పరుగులు సాధించాడు. సుమారు 30 ఏళ్ల వయసులోనే 2020 సంవత్సరంలో క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు.
ఆ తర్వాత అంపైరింగ్పై దృష్టి పెట్టాడు. లెవల్ 2 కోర్సులో ఉత్తీర్ణత సాధించిన శ్రీవాస్తవను బీసీసీఐ.. ఐపీఎల్ అంపైర్గా నియమించింది. దీంతో ఐపీఎల్ ఆడి.. 35 ఏళ్ల వయుసులోనే అంపైర్గా నియమితుడైన వ్యక్తిగా అతడు రికార్డు సృష్టించాడు. తన్మయ్ అంపైర్గా ఎంపికైన విషయాన్ని యూపీ క్రికెట్ సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
అయితే ఐపీఎల్ 2025లో శ్రీవాస్తవకు ఫీల్డ్ అంపైర్ బాధ్యతలు దక్కకపోవచ్చు. అతడు ఇతర బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa