ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదేళ్లలో ఇండియా జీడీపీ డబుల్

business |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 10:38 PM

 గత కొంతకాలంగా అంతర్జాతీయంగా ఎన్ని అనిశ్చితి పరిస్థితులు ఎదురైనా.. రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం చెక్కుచెదరలేదు. స్థిరంగా రాణిస్తుందని పలు గణాంకాలు స్పష్టం చేశాయి. ఏటా జీడీపీ, ద్రవ్యోల్బణం దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు భారత్ మరో ఘనత సాధించింది. గత పదేళ్లలో భారత జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి) రెట్టింపు అయింది. ఈ మేరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి గణాంకాల్లో వెల్లడైంది. దీనికి సంబంధించిన గణాంకాల్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు.


2015లో భారత ఆర్థిక వ్యవస్థ 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఏకంగా 105 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా, రెండో స్థానంలోని చైనాకు కూడా సాధ్యం కాలేదు. దీంతో.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లువంటి ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని చెప్పొచ్చు.


ఇక ఐఎంఎఫ్ ప్రకారం.. ఇదే విధంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కొనసాగితే.. 2025 నాటికి జపాన్, 2027 నాటికి జర్మనీని అధిగమించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. '2015 నుంచి 2025 మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో వృద్ధి చెందింది. దీని ఫలితంగా ప్రపంచంలోనే టాప్-5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. ఐఎంఎఫ్ డేటా ప్రకారం, ఈ వృద్ధి కొనసాగితే, అతి త్వరలోనే జపాన్, జర్మనీలను కూడా దాటేస్తుంది.' అని ఐఎంఎఫ్ వెల్లడించింది.


ఇదే సమయంలో ఇన్ఫేషన్ అడ్జస్ట్ చేసిన తర్వాత జీడీపీ భారతదేశంలో గత పదేళ్లలో 77 శాతం పెరిగింది. ఈ క్రమంలో 2.4 ట్రిలియన్ డాలర్లు నుంచి 2025లో అది 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఐఎంఎఫ్ గణాంకాలతో ట్వీట్ చేశారు. 'గ్లోబల్ షిఫ్ట్ ఈజ్ రియల్' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో.. భారత జీడీపీ పదేళ్లలో రెట్టింపు వృద్ధి సాధించిందని అన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతుందని పేర్కొన్నారు. బీజీపే నాయకుడు అమిత్ మాలవీయ కూడా స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో.. ఆయన ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.


ఈ డేటా ప్రకారం.. చైనా ఈ సమయంలో 76 శాతం వృద్ది రేటు నమోదు చేసింది. 11.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 19.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ.. 18.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 30.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో 66 శాతం పెరిగింది. ఇక జపాన్ వృద్ధి రేటు సున్నాగా ఉన్నట్లు ఈ గణాంకాల్లో తేలింది. 4.4 ట్రి.డా. వద్ధ స్థిరంగా ఉంది. ప్రస్తుతం భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com