ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.5000.. ఏప్రిల్‌ 15 వరకే దరఖాస్తుకు ఛాన్స్‌

Education |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 10:38 PM

పీఎం ఇంటర్న్‌షిప్ పథకం 2025 రెండో రౌండ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమై.. కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ స్కీమ్‌కి సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రతి నెలా రూ.5వేల స్టైపెండ్ లభిస్తుంది. కాబట్టి.. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే కింద ఇచ్చిన లింక్ సాయంతో దరఖాస్తు చేసుకోండి. పీఎం ఇంటర్న్‌షిప్ అధికారిక వెబ్‌సైట్ https://pminternship.mca.gov.in/login/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


రిజిస్ట్రేషన్ ఫీజు లేదు


పరిశ్రమలోని యువతకు రియల్‌ టైమ్‌ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించే లక్ష్యంతో ఈ పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ రూపకల్పన చేశారు. మొదటి దశ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత.. మంత్రిత్వ శాఖ తిరిగి నమోదుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఏప్రిల్‌ 15, 2025 వరకు నమోదు చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్‌ క్రియేట్ చేసి వివిధ రంగాలలోని అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోండి. రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు రుసుము లేదు.


ఉండాల్సిన అర్హతలివే :


ఈ పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. కానీ.. బీ.టెక్, ఎంబీఏ, సిఏ, ఐఐటీలు, ఐఐఎంలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెషనల్ డిగ్రీలు కలిగిన అభ్యర్థులు ఈ పథకానికి అర్హులు కాదు. అభ్యర్థులు ఒకే సైకిల్‌లో గరిష్టంగా 5 ఇంటర్న్‌షిప్ ఎంపికలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నచ్చిన రంగం, ఉండే ప్రాంతం, చేయాలనుకున్న పని, అర్హతల ఆధారంగా ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.


అలాగే.. ఐటీఐ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐతో పాటు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా హోల్డర్లకు, 12వ తరగతితో పాటు ఏఐసీటీఇ గుర్తింపు పొందిన డిప్లొమా తప్పనిసరి. అదే సమయంలో.. గ్రాడ్యుయేట్ స్థాయిలో దరఖాస్తు చేసుకునే వారు యూజీసీ లేదా ఏఐసీటీఇ ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఈ ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2025 కింద ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ. 5,000 స్టైపెండ్ లభిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.4,500, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధి నుండి రూ.500 ఇస్తారు. ఇది కాకుండా అభ్యర్థులకు అదనంగా ఒకేసారి రూ. 6,000 అందజేస్తారు.


ఇలా దరఖాస్తు చేసుకోండి :


మొదట అధికారిక వెబ్‌సైట్ https://pminternship.mca.gov.in/login/ ఓపెన్‌ చేయండి.


హోమ్‌పేజీలో 'రిజిస్ట్రేషన్ లింక్' పై క్లిక్ చేయండి.


మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకుని మీరే లాగిన్ వివరాలను ఎంటర్‌ చేయండి.


దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను (ఆధార్ కార్డు, విద్యా ధృవపత్రాలు, సెల్ఫ్ డిక్లరేషన్, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్) అప్‌లోడ్ చేయండి.


దరఖాస్తు ఫామ్‌ను జాగ్రత్తగా చెక్‌ చేసి సమర్పించండి.


భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫామ్‌ ప్రింటవుట్ తీసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com