ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి కోసం 10 ప్రత్యేక సిట్ బృందాల గాలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 08:29 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి కోసం ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం  గాలింపును తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారులు హైదరాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కసిరెడ్డికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ప్రదేశాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా రాజ్ కసిరెడ్డి పాత్ర కీలకమని సిట్ అధికారులు ముందునుంచీ భావిస్తున్నారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ, కసిరెడ్డి స్పందించలేదని, విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్నారని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కుంభకోణం వెనుక ఉన్న మరింత మంది కీలక వ్యక్తుల వివరాలు రాబట్టాలంటే కసిరెడ్డి విచారణ అత్యంత ముఖ్యమని దర్యాప్తు అధికారులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌లో మొత్తం 10 ప్రత్యేక సిట్ బృందాలు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు. ఒకటి రెండు రోజుల పాటు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి లభ్యమైతే ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించవచ్చని, మరిన్ని వివరాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. కసిరెడ్డి దొరికితే తక్షణమే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com