ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నో వేల మంది అభిమానిస్తుంటారు, ఆరాధిస్తుంటారు. ఆయన్ను కలవాలని, మాట్లాడాలని, తాకాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే వేలాది మందికంటే వినూత్నంగా చేశాడో అభిమాని. నరేంద్ర మోదీ ప్రధాని అవ్వాలని, ఆయన పీఎం అయ్యాకా తాను వెళ్లి ఆయన్ను కలిశాకే చెప్పులు వేసుకుంటానని.. అప్పటి వరకు ఉత్తి కాళ్లతోనే నడుస్తానంటూ ఓ వ్యక్తి ప్రతినబూనాడు. దాదాపు 14 ఏళ్లుగా చెప్పులు లేకుండానే తిరుగుతున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నేడు ఆ అభిమానిని కలిశారు. స్వయంగా ఆయనే షూ బహుమతిగా ఇచ్చి ఆయన కాళ్లకు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు 800 మెగా వాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించిన ఆయన.. యమునా నగర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి అనేక విషయాల గురించి మాట్లాడారు. అయితే ఆ తర్వాత కైతాల్కు చెందిన తన అభిమానిని కలిశారు. అయితే ఆ అభిమాని మరెవరో కాదు కశ్యప్ రాంపాల్. ఈయన ప్రధాని మోదీకి చాలా పెద్ద అభిమాని. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఆయన్ను ఆరాధిస్తున్నాడు. ఇలాంటి ఓ నేత ప్రధాని అయితే చూడాలని కలలు కన్నాడు. కేవలం కలలు కనడమే కాదండోయ్.. కచ్చితంగా మోదీ ప్రధాన మంత్రి కావాలని అనేక ప్రార్థనలు చేశాడు.
ముఖ్యంగా మోదీ ప్రధాని అయ్యే వరకు తాను చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాకుండా ఒకవేళ మోదీ ప్రధాని అయితే ఆయన్ను కలిశాకే తాను చెప్పులు వేసుకోవాలని నిర్ణయించున్నాడు. అయితే 14 ఏళ్ల క్రితం కశ్యప్ రాంపాల్ ఈ ప్రతినబూనగా.. ఇన్నాళ్లూ చెప్పులు వేసుకోలేదు. మోదీ.. ప్రధాని అయినప్పటికీ తాను కలవలేదు కాబట్టి.. 14 ఏళ్లుగా ఉత్తి కాళ్లతోనే నడిచాడు. ఈయన గురించి తెలుసుకున్న మోదీ.. నేడు ఆయన్ను ప్రత్యేకంగా కలిశారు. నేరుగా మోదీయే ఈయన కోసం షూ తెప్పించారు. కశ్యప్ రాంపాల్ తన వద్దకు రాగానే ప్రేమగా మాట్లాడి.. చెప్పులు ధరించమని కోరారు. మోదీ చెప్పేసరికి కశ్యప్ రాంపాల్ కూడా అంగీకరించారు. ఈక్రమంలోనే ప్రధాని మోదీయే నేరుగా ఆయనకు షూ తొడిగారు.
ఈసమయంలోనే అక్కడున్న వారు దీన్ని వీడియోగా తీయగా.. నేరుగా ప్రధాని మోదీయే దీన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తనకోసం ప్రతిజ్ఞ చేసిన అభిమానని కలిశానని, చాలా సంతోషంగా అనిపించిందని చెప్పారు. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న వారి అభిమానానికి తానెప్పుడూ దాసుడే అని వివరించారు. అయితే తన అభిమానులు ఎవరూ ఇలాంటి ప్రతిజ్ఞలు చేయొద్దని.. సమాజ సేవ, దేశానికి ఉపయోగపడే మరేవైనా చేస్తే తాను మరింత సంతోష పడతానని వెల్లడించారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ.. మోదీ ప్రేమకు పొంగిపోతున్నారు. ఆయనే స్వయంగా చెప్పులు వేయడం చూసి మురిసిపోతున్నారు. ప్రధాని శత్రువులు కూడా ఆయన ప్రేమకు దాసులు కావాల్సిందేనంటూ వివరిస్తున్నారు.
![]() |
![]() |