ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థిగా వెళ్లి ఉగ్రవాదిగా తిరిగొచ్చిన ఆదిల్ అహ్మద్.

national |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 08:36 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో కీలక నిందితుడు అయిన ఆదిల్ అహ్మద్ థోకర్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నప్పటి నుంచే నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన ముష్కరులకు దగ్గరగా మెదిలిన అతడు.. ఉగ్రవాదంపై ఆసక్తి చూపించాడు. ఈక్రమంలోనే ఉన్నత విద్యల పేరుతో విద్యార్థి వీసాపై పాకిస్థాన్ వెళ్లాడు. అయితే తిరిగి పట్టాభద్రుడిగా రావడానికి బదులుగా ఉగ్రవాదిగా మారొచ్చాడు. అదును చూసి పహల్గాంపై దాడి చేసి అమాయక పర్యటకుల ప్రాణాలు తీశాడు. ఆపూర్తి వివరాలు మీకోసం.


 అతడో కిరాతకుడు.. తల్లి పాలు తాగిన రొమ్మును గుద్దే నీచుడు. మన దేశంలో పుట్టి పెరిగి.. శత్రుదేశంతో చేతులు కలిపాడు. అక్కడికి విద్యార్థిగా వెళ్లి ఉగ్రవాదిగా మారొచ్చాడు. అతడే పహల్గాం కీలక నిందితుడు.. ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్. పహల్గాంలో పర్యాటకులకు మరణ శాసనం రాసింది కూడా ఇతడే కాగా.. పుట్టింది జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్‌ జిల్లాలో. ఈ ఉగ్రవాది అసలు కథ ఏంటంటే..?


20 ఏళ్ల ఆదిల్ థోకర్ అనంత్‌నాగ్‌ జిల్లాలోని బిజ్‌బెహారాకు సమీపంలోని గురీ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. టీనేజ్‌లో ఉండగానే పలు నిషేధిక ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదులకు దగ్గరయ్యాడు. 2018లో దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో పాల్గొన్నాడు. అదే ఏడాది పాక్ విద్యార్థి వీసా సాధించి వాఘా సరిహద్దు నుంచి పాక్‌లోకి అడుగుపెట్టాడు. ముందు నుండే ఉగ్రవాద భావజాలం కలిగిన ఆదిల్.. పాక్‌కు వెళ్లాక ఎవరితో టచ్‌లో లేకుండా పోయాడు. దాదాపు 8 నెలల పాటు కుటుంబంతోనూ మాట్లాడలేదు.


ఇలాంటి వారిపై నిఘా పెట్టే ఏజెన్సీలు కూడా ఆదిల్ సమాచారాన్ని సేకరించలేకపోయాయి. కనిపించకుండా పోయిన ఆదిల్.. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో చేరినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌లో శిక్షణ తీసుకుని టాప్ కమాండర్లతో కలిసి పని చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. శిక్షణ పూర్తై, కొన్ని నెలలు పని చేశాక.. 2024 చివర్లో భారత్‌కు తిరిగి వచ్చాడు. కానీ ఈసారి అధికారిక మార్గాల్లో కాకుండా.. పూంఛ్-రాజౌరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖను దాటి అక్రమంగా చొరబడ్డాడు. గుట్టలు, దట్టమైన అటవీ ఉన్న ఆ ప్రాంతం నుంచి ఆదిల్ తనతో పాటు కొత మంది పాకిస్థానీలను కూడా తీసుకువచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అలా తీసుకువచ్చిన వారిలో పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న సులేమాన్ కూడా ఒకడు.


సరిహద్దు నుంచి తన స్వస్థలానికి చేరుకున్న ఆదిల్.. నిఘా ఏజెన్సీలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. అనంత్‌నాగ్‌లో అతడు అండర్‌గ్రౌండ్‌లో దాక్కున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కొన్ని వారాల పాటు స్థాిక టెర్రరిస్ట్ సెల్స్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపి పహల్గాం ఉగ్రదాడికి పథకం రచించినట్లు తెలిసింది. భారత్‌లో చేపట్టబోయే ఉగ్రదాడి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా భారీ కుట్ర పన్నినట్లు అధికారులు భావిస్తున్నారు. అనువైన ప్రదేశం కోసం స్థానిక ఉగ్రవాద విభాగాలతో నిరంతరం సంప్రదింపులు జరిపాడు. రద్దీగా ఉండే టూరిస్ట్ ప్రదేశాలను ఎంచుకోవాలని భావించినా.. భద్రతా బలగాలలకు సవాలుగా ఉండే బైసరన్ లోయ అయితే తప్పించుకునేందుకు వీలు ఎక్కువగా ఉంటుందని దాన్ని ఎంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.


ఏప్రిల్ 22న, పగలు 2 గంటల ప్రాంతలో ఆదిల్ సహా ఇంకొంత మంది ఉగ్రవాదులు దట్టమైన పైన్ అడవుల గుడా బైసరన్ లోయలోకి చేరుకున్నారు. పర్యాటకులను చుట్టుముట్టి, ముస్లింలా, హిందువులా అని అడిగి, మగవారి ప్యాంట్‌లు విప్పి తనిఖీ చేసి ముస్లింలు అయితే వదిలేశారు. హిందువులు అయితే అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపి హతమార్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com