ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంఎంటీఎస్‌ అత్యాచార కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన యువతి

Crime |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 10:04 PM

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ రైలులో జరిగినట్లుగా భావించిన అత్యాచార యత్నం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి చవ్చింది. ఓ యువతి రైలు నుండి కిందకు దూకడానికి అసలు కారణం అత్యాచార యత్నం కాదని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువతి రైలులో ప్రయాణిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయింది. అయితే, ఈ విషయాన్ని చెబితే అందరూ తిడతారనన్న భయంతో, పరువు పోతుందని భావించి.. ఆమె ఒక యువకుడు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే తాను రైలు నుంచి కిందికి దూకేశానంటూ కట్టుకథ అల్లుకొచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.


అయితే.. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో లోతుగా విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఆ యువతే పోలీసుల ఎదుట నిజం ఒప్పుకుందని తెలుస్తోంది. ఆ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్‌తో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొదట అత్యాచార యత్నం జరిగిందని భావించి దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో విస్మయానికి గురయ్యారు.


మార్చి 23వ తేదీన.. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద ఓ యువతి.. తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని అటుగా వెళ్లిన స్థానికులు గమనించి.. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాస్త కోలుకున్న తర్వాత.. అసలు ఏమైందని బాధిత యువతిని పోలీసులు ఆరా తీయగా.. అమ్మాయి పోలీసులకు ఓ స్టోరీని చెప్పింది. అనంతపురం జిల్లాకు చెందిన తాను.. మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో గతకొన్నాళ్లుగా ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.


మార్చి 23వ తేదీన తన మెుబైల్ ఫోన్ రిఫేర్ కోసం సికింద్రాబాద్‌కు వెళ్లి పని పూర్తి కాగానే.. ఎంఎంటీఎస్‌ ట్రైన్‌లో మేడ్చల్‌కు బయలుదేరానని.. సికింద్రాబాద్ స్టేషన్‌లో మహిళల కోచ్‌లోనే ఎక్కినట్టు తెలిపింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు కూడా ఉండగా.. వారు అల్వాల్‌ స్టేషన్‌లోనే దిగిపోయారని తెలిపింది. బోగీలో తాను ఒంటరిగా ఉండటం చూసి.. అందులోనే ఉన్న ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి యత్నించినట్టు ఆ యువతి చెప్పుకొచ్చింది. అయితే.. అతని నుంచి తప్పించుకునేందుకు గట్టిగా కేకలు వేశానని.. ఎవరూ లేకపోవటంతో కాసేపు ప్రతిఘటించానని.. ఇక తప్పని పరిస్థితుల్లో ట్రైన్ నుంచి కిందకు దూకేసినట్టు చెప్పుకొచ్చింది.


ఈ విషయాన్ని పోలీసులు, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని.. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. అసలు విషయమేంటంటే.. తాను ఆ నిందితున్ని గుర్తుపట్టలేనని.. కానీ తాను ఎక్కిన స్టేషన్ మాత్రం చెప్పగలనంటూ కేసును మరింత జఠిలం చేసే ప్రయత్నం చేసింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 250 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. 100 మంది అనుమానితులను ప్రశ్నించారు. చివరికి పోలీసులు ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే.. ఆమె చెప్పిన కథకు.. కేసుకు ఎన్ని రోజులైనా పొంతనా కుదరకపోవటంతో పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. యువతి అసలు ట్విస్ట్ రివీల్ చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచింది.


ఈ ఘటన బాధ్యతారాహిత్యంగా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియజేస్తోంది. అంతేకాకుండా.. భయంతో తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల దర్యాప్తు ఎలా తప్పుదోవ పడుతుందో కూడా ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa