ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను చనిపోయాక న్యాయం జరగకుంటే.. అస్థికలు కాల్వలో పారేయండి

Crime |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 09:07 PM

ఇటీవలి కాలంలో భార్యల వేధింపులతో భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు గణనీయంగా పెరుగుతున్నాయి. వివాహం అనంతరం మానసిక, ఆర్థిక, ఒత్తిడితో కూడిన వేధింపులు, తప్పుడు కేసులతో బెదిరింపులు వంటి అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. గతేడాది బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన యావత్తు దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. తాజాగా, మరో భార్య బాధిత టెకీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఎటావాలో 33 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోహిత్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్య, అత్తింటి వారు వేధింపులకు గురిచేశారంటూ ఒక వీడియో రికార్డ్ చేసి మోహిత్ ప్రాణాలు తీసుకున్నాడు. ‘‘నా మరణానంతరం కూడా న్యాయం రాకపోతే, నా అస్థికలను కాలువలో పారేయండి’’ అని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.


  కోటా వెళ్తున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి గురువారం బయలుదేరిన మోహిత్ యాదవ్.. ఎటావా రైల్వే స్టేషన్ సమీపంలోని జాలీ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది.. సాయంత్రం లోపలికి వెళ్లి చూడగా అతడు ఉరివేసుకుని కనిపించాడని ఎటావా సిటీ ఎస్పీ అభయ్ నాథ్ త్రిపాఠీ తెలిపారు.


ఔరైయా జిల్లాకు చెందిన మోహిత్ యాదవ్.. ఒక సిమెంట్ కంపెనీలో ఫీల్డ్ ఇంజినీరుగా పని చేస్తున్నాడని తెలిపారు. అతడి భార్య ప్రియాతో ఏడేళ్ల ప్రేమలో ఉన్న మోహిత్.. 2023లో ఆమెను వివాహం చేసుకున్నారు. తన భార్య రెండు నెలల కిందట బీహార్‌లో ప్రైవేట్ టీచర్‌గా ఉద్యోగంలో చేరినప్పడు గర్భవతిగా ఉందని, అయితే ఆమె తల్లి బలవంతంగా అభార్షన్ చేయించిందని మోహిత్ ఆరోపించారు. ప్రియా నగలన్నీ తన తల్లి వద్దే ఉంచిందని, పెళ్లిలో ఎటువంటి కట్నం డిమాండ్ చేయలేదని, అయినా తన భార్య తనను బెదిరించిందని వాపోయాడు.


‘‘ఇల్లు, ఆస్తిని తన పేరుపై రిజిస్టర్ చేయకపోతే, వర్నకట్న వేధింపుల కేసులో నా కుటుంబాన్ని ఇరికిస్తానని భార్య బెదిరించింది’’ అని పేర్కొన్నారు. ఆమె తండ్రి మనోజ్ కుమార్ తప్పుడు ఫిర్యాదు చేశాడని, ఆమె సోదరుడు తనను చంపుతానని బెదిరించాడని అన్నారు. తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుతూ ‘‘నేను చనిపోయిన తర్వాత కూడా న్యాయం జరగకపోతే నా అస్థికలను కాలువలో పారేయండి’ అని మోహిత్ కన్నీటి పర్యంతమయ్యారు.


‘‘తప్పుడు ఆరోపణల నుంచి రక్షించే చట్టం మగాళ్లకు ఉండుంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు... భార్య, ఆమె కుటుంబం వేధింపులను భరించలేకపోయాను,’’ అని పేర్కొన్నారు. మోహిత్ అన్న తరీన్ ప్రతాప్ మాట్లాడుతూ.. కోటా వెళ్లడానికి ఇంటి నుంచి బయల్దేరాడని, కానీ మధ్యలో ఎటావాలో ఆగాడని చెప్పారు. శుక్రవారం ఉదయం వీడియో లభించిన తరువాత కుటుంబం షాక్‌కు గురైంది. కాగా, ఈ ఘటన, మహిళల వల్ల తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న పురుషులను రక్షించేందుకు ప్రత్యేక చట్టం అవసరమన్న డిమాండ్‌కు మరొక ఉదాహరణగా నిలుస్తోంది. గతేడాది బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్ తన భార్య తప్పుడు కేసులు వేధిస్తోందంటూ ఆత్మహత్య చేసుకున్న ఘటన తరువాత భార్యా బాధిత సంఘాల కార్యకర్తలు గట్టిగా ఈ డిమాండ్ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com