ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారులకు శుభవార్త. చేపలవేటపై నిషేధం ఉన్న సమయంలో మత్స్యకారుల జీవనం కోసం ఏపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా పేరుతో ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు సాయం అందిస్తుండగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.20 వేలకు పెంచింది. అలాగే ఏప్రిల్ 26వ తేదీన మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు రేపు (శనివారం) మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ కానుంది.
మత్స్యకార భరోసాను సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెం నుంచి మత్స్యకార భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా మత్స్యకార భరోసా సాయాన్ని.. మత్స్యకారుల చేతికి అందించనున్నారు. అమరావతి నుంచి విశాఖపట్నం మీదుగా బుడగట్లపాలెం వెళ్లనున్నారు చంద్రబాబు.. లబ్ధిదారులకు సాయాన్ని అందించిన అనంతరం.. వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రానికి తిరిగి అమరావతికి చేరుకుంటారు. మరోవైపు మత్స్యకార భరోసా సాయం విడుదలపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |