విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్పై కూటమి టీడీపీ-జనసేన-బీజేపీ కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. ఈ పరిణామంతో కూటమి సభ్యులు సంబరాలు చేసుకున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీధర్ అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడామని వారు వ్యాఖ్యానించారు.అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం కూటమి కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్ల వైసీపీ పాలనలో విశాఖ నగరంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. కనీసం వీధి దీపాలు వెలిగించలేని, తాగునీటి సమస్యలు పరిష్కరించలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. తమ అవిశ్వాస తీర్మానానికి 74 మంది సభ్యులు మద్దతు తెలిపారని, ఇది విశాఖ ప్రజల విజయమని అన్నారు. కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూడా తమకు న్యాయం జరగలేదనే భావనతో, అభివృద్ధి కాంక్షించి అవిశ్వాసానికి మద్దతు పలికారన్నారు.గత పాలనలో జరిగిన అవినీతికి, అభివృద్ధి రాహిత్యానికి ఈ అవిశ్వాస విజయంతో ముగింపు పలికామని కూటమి కార్పొరేటర్లు పేర్కొన్నారు. రాబోయే కొద్ది కాలంలోనే విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కూటమి కైవసం చేసుకుంటుందని, ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని వారు తెలిపారు. ఈ విజయంతో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైందని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు.
![]() |
![]() |