భారత విమానాలకు పాకిస్థాన్ తమ గగనతలాన్ని మూసివేయడంతో విమానయాన రంగంపై, ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ప్రయాణ దూరం, సమయం గణనీయంగా పెరగనుండటంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్విమానయాన సంస్థలకు, ప్రయాణికుల సౌకర్యార్థం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.పాక్ గగనతలం అందుబాటులో లేకపోవడంతో, విమానాలు ప్రత్యామ్నాయ, సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, ఇంధనం నింపుకోవడానికి లేదా విమాన సిబ్బందిని మార్చడానికి మార్గమధ్యంలో సాంకేతిక విరామం అవసరం ఏర్పడవచ్చని డీజీసీఏ హెచ్చరించింది. ఇలాంటి సమయాల్లో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, పెరిగిన ప్రయాణ సమయానికి అనుగుణంగా విమానాల్లో అదనపు ఆహారం, పానీయాలు, నీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అత్యవసర వైద్య సదుపాయాలు, సిబ్బంది అప్రమత్తతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది.ప్రస్తుతం ఢిల్లీ, అమృత్సర్ వంటి ఉత్తర భారత నగరాల నుంచి యూఏఈ, యూరప్, యూకే, ఉత్తర అమెరికా వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్జెట్ విమానాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విమానాలు ఇకపై ముంబై, అహ్మదాబాద్ మీదుగా అరేబియా సముద్రంపై నుంచి మస్కట్ వైపు మళ్లి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గంలో బలమైన ఎదురుగాలులు ఉంటాయని, ఇది ప్రయాణ సమయాన్ని మరింత పెంచుతుందని పైలట్లు చెబుతున్నారు.ఈ పరిణామం విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చులను పెంచుతుంది. ఇంధన వినియోగం, అదనపు ల్యాండింగ్ ఛార్జీలు, సిబ్బంది ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా సుదూర సర్వీసులు నడిపే ఎయిర్ ఇండియాపై ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. పెరిగిన దూరం కారణంగా ఇండిగో కొన్ని అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అదనపు ఖర్చుల భారం చివరికి టికెట్ ధరలపై పడే అవకాశం ఉందని, కొత్త బుకింగ్లపై ధరలు 30-40 శాతం వరకు పెరగవచ్చని అంచనా.ప్రయాణ సమయం పెరగడం, మార్గమధ్యంలో ఆగడం వల్ల కనెక్టింగ్ ఫ్లైట్లను కోల్పోయే ప్రయాణికుల విషయంలో స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని, నిర్దిష్ట సమయం మించి ఆలస్యమైతే పరిహారం అందించే ఏర్పాట్లు చేయాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. 2019లో బాలాకోట్ దాడుల అనంతరం పాక్ గగనతలం మూసివేసినప్పుడు భారత విమానయాన సంస్థలు సుమారు రూ.700 కోట్లు నష్టపోయిన నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితి కూడా ఆర్థికంగా సవాలుగా మారనుంది.
![]() |
![]() |