ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి కేంద్ర నిధులు విడుదల..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 06:41 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.1121.20 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన నిధులలో గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్‌లకు 20 శాతం నిధులు కేటాయిస్తారు. అలాగే జిల్లా పరిషత్‌లకు 10 శాతం నిధులు కేటాయించనున్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో బ్యాంక్ అకౌంట్లలో జనాభా ప్రాతిపదికన ఈ నిధులను ఆర్థిక శాఖ అనుమతితో పంచాయతీ రాజ్‌ శాఖ జమ చేయనుంది. రెండు. మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.


రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ కింద ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఈ నిధులను కేటాయిస్తుంది. టైడ్, అన్ టైడ్ గ్రాంట్ల రూపంలో ఈ నిధులు విడుదల చేస్తారు. అన్‌టైడ్ గ్రాంట్లను జీతాలు మినహా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక సంస్థలు వాడుకోవచ్చు. టైడ్ గ్రాంట్లను పారిశుద్ధ్యం, నీటి నిర్వహణ, ఓడీఎఫ్ పనులు, వర్షపు నీటి పునర్వియోగం, వాటర్ రీసైక్లింగ్ వంటి పనులకు ఉపయోగించవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తుంటారు. ఇప్పటికే తొలి విడత నిధులను విడుదల చేయగా.. తాజాగా రెండో విడత నిధులను కేంద్రం విడుదల చేసింది.


మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన తర్వాత రోజునే ఈ నిధులను కేంద్రం విడుదల చేయడం విశేషం. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అమరావతి పునఃప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అంతకు రెండు రోజుల ముందు కూడా చంద్రబాబు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. పుట్టినరోజు సందర్భంగా విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. అక్కడి నుంచి భారతదేశానికి రాగానే పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అమిత్ షా, సీఆర్ పాటిల్ సహా పలువురు మంత్రులతో సమావేశమై ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com