ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30 సెంట్ల భూమి కోసం.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన కొడుకు..

Crime |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 10:31 PM

విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 30 సెంట్ల స్థలం కోసం కన్నవాళ్లను దారుణంగా హత్యచేశాడో కొడుకు. ఆస్తి వివాదాల నేపథ్యంలో తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడుపూరి కల్లాలు గ్రామంలో చోటుచేసుకుంది. సోదరికి భూమిని రాసివ్వాలన్న తల్లిదండ్రుల ప్రతిపాదనకు కొడుకు రాజశేఖర్ అంగీకరించలేదు. ఈ క్రమంలోనే గొడవలు జరగ్గా.. శనివారం ట్రాక్టర్‌తో తొక్కించి తల్లిదండ్రులను హత్య చేశాడు. ఫ్రస్తుతం రాజశేఖర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావంటే.. తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను సైతం దూరం చేస్తానందట.. ఇది పెద్దలు చెప్పేమాట. మానవ సంబంధాల కన్నా ఆర్థిక సంబంధాలే ఎక్కువైన ప్రస్తుత సమాజంలో ఈ మాట అక్షర సత్యమని రుజువవుతోంది. పుత్రుడంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడనుకున్నారు.. కానీ ఆ నరకాన్ని బతకుండగానే చూపించేవాడవుతాడని ఊహించలేకపోయారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రయోజకుడై తమను కంటికి రెప్పలా కాపాడతాడని భావించింది ఆ అమాయకుపు తల్లి.. తాను భుజం మీద మోసిన కొడుకు వృద్ధాప్యంలో తమకు తోడుగా ఉంటాడని భావించాడు ఆ తండ్రి.. కానీ వారి ఆశలు గల్లంతయ్యాయి. కన్న కలలన్నీ కల్లలయ్యాయి.


పేగు బంధాన్ని మరచిన ఆ పుత్రరత్నం.. 30 సెంట్ల స్థలం కోసం కన్నవాళ్లను దారుణంగా హత్య చేశాడు. తనకు జన్మనిచ్చి, వయసొచ్చే వరకూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తల్లిదండ్రులను కనీసం కనికరం లేకుండా.. చంపొద్దంటూ ప్రాధేయపడినా వినకుండా.. ట్రాక్టర్‌తో తొక్కించి హత్యచేశాడు. రక్తం పంచి ఇచ్చిన తల్లిదండ్రుల రక్తం కళ్లజూశాడు. కన్నవాడే కాలనాగులా మారి వేటాడుతుంటే.. ఏం చేయాలో తెలియని ఆ తల్లిదండ్రులు తమను వదిలేయాలంటూ కాళ్లావేళ్లా పడ్డారు. పొలం వెంట పరుగులు తీశారు. తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ.. కుమారుడి రూపంలో పుట్టిన రాక్షసుడి ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు పుట్టినప్పుడు పొత్తిళ్లల్లో ఎత్తుకుని మురిసిపోయిన ఆ పుత్రరత్నం చేతిలోనే.. అతి దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.


విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన అప్పలనాయుడు, జయ దంపతులకు రాజశేఖర్ అనే కొడుకు ఉన్నాడు. రాజశేఖర్‌కు రెండేళ్ల కిందట పెళ్లి చేశారు. పెళ్లి అయిన కొన్ని రోజులకే తమ కొడుకు తమ మాట కాకుండా కోడలు చెప్పిందే చేస్తున్నాడంటూ ఆ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఇవి కాస్తా ఆస్తి వివాదాలకు కారణమయ్యాయి. ఇదే సమయంలో అప్పలనాయుడు దంపతులు తమ కుమార్తెకు కొంత భూమి ఇవ్వాలనుకున్నారు. భర్తను కోల్పోయిన కూతురికి 30 సెంట్ల భూమిని రాసిస్తే ఆమెకు సహాయంగా ఉంటుందని భావించారు. అయితే సోదరికి భూమి ఇచ్చేందుకు రాజశేఖర్ అంగీకరించలేదు. ఈ క్రమంలోనే గొడవలు మరింత పెరిగాయి.


ఇది ఇలా ఉండగానే రాజశేఖర్ భూమిని అమ్మేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్‌తో మట్టిని తీసుకువచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ తల్లిదండ్రులు.. భూమిని చదును చేయకుండా అడ్డుకున్నారు. దీంతో మరోసారి మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన రాజశేఖర్.. ట్రాక్టర్‌తో తల్లిదండ్రులను తొక్కించి హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ ఊరు మొత్తం ఉలికిపడింది.


అయితే ఈ భూములు ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్నాయి. దీంతో భూమి రేట్లు పెరిగాయి. ఈ విషయం కారణంగానే భూమిని సోదరికి ఇవ్వడానికి రాజశేఖర్ అంగీకరించనట్లు తెలిసింది. అలా భర్తను కోల్పోయిన కుమార్తెకు అండగా ఉందామని ప్రయత్నించిన ఆ దంపతులు.. కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com