ఏపీలో నక్సల్ కలకలం రేగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల కదలికలపై అందిన నిర్దిష్ట సమాచారంతో భద్రతా బలగాలు ఏజెన్సీలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది.అల్లూరి జిల్లా పరిధిలోని కాకులమామిడి, కంటారం సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. పోలీసులను గమనించిన మావోయిస్టులు వెంటనే వారిపైకి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కూడా ప్రతిగా కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య కొంతసేపు కాల్పులు కొనసాగిన అనంతరం, మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని దట్టమైన అడవిలోకి పారిపోయినట్టు తెలుస్తోంది. పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ గాలింపును తీవ్రతరం చేశాయి.ఇదిలా ఉండగా, పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో గత కొన్నాళ్లుగా మావోయిస్టుల వేట కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం బీజాపూర్ జిల్లా పరిధిలోని నడిపల్లి-గల్గామ్ గ్రామాల మధ్య అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో అక్కడ కూడా ఇరువర్గాల మధ్య ఫైరింగ్ జరిగింది.గత వారం రోజులుగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా వేలాది మంది భద్రతా సిబ్బందితో భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగానే కర్రెగుట్టల ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మరణించారు. తాజా ఘటనలతో సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమై కూంబింగ్ను కొనసాగిస్తున్నాయి.
![]() |
![]() |