ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా రేషన్ కార్డులు భారత పౌరసత్వానికి ధ్రువీకరణ కావని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి కేవలం గుర్తింపు, చిరునామా నిర్ధారణ, పన్ను చెల్లింపులు లేదా సంక్షేమ పథకాల లబ్ధి వంటి పరిపాలనాపరమైన అవసరాలకు మాత్రమే ఉపయోగపడతాయని తెలిపింది. భారత పౌరసత్వాన్ని కచ్చితంగా నిరూపించేందుకు 'జనన ధృవీకరణ పత్రం', 'నివాస ధృవీకరణ పత్రం' మాత్రమే చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం పేర్కొంది.భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కూడా ఆధార్ కార్డు కేవలం గుర్తింపు, నివాస రుజువు మాత్రమేనని, పౌరసత్వానికి కాదని గతంలోనే స్పష్టం చేసింది. అదేవిధంగా, పాన్ కార్డు పన్ను సంబంధిత అవసరాలకు, రేషన్ కార్డు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార వస్తువుల పంపిణీకి మాత్రమే ఉపయోగపడతాయి. ఇవి ఏవీ పౌరసత్వాన్ని ధ్రువీకరించవు.రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ 1969 ప్రకారం.. సంబంధిత అధికార యంత్రాంగం జారీ చేసే జనన ధృవీకరణ పత్రం, భారతదేశంలో జన్మించినట్లుగా పేర్కొనే హక్కు ఆధారంగా పౌరసత్వాన్ని ధ్రువీకరిస్తుంది. అలాగే, ఒక వ్యక్తి నిర్దిష్ట రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో నివసిస్తున్నట్లు ధృవీకరించే నివాస పత్రం కూడా పౌరసత్వ నిర్ధారణకు కీలకమైన ఆధారంగా ప్రభుత్వం పరిగణిస్తుంది.
![]() |
![]() |