ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింధు జలాల ఒప్పందం రద్దుపై పాక్ 4 పాయింట్స్ ప్లాన్

international |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 11:47 PM

పహల్గామ్‌లో పర్యాటకుల ఊచకోత వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని బలంగా నమ్ముతోన్న భారత్.. దాయాదిపై దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. అలాగే, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా రద్దుచేసింది. ఈ ఒప్పందాన్ని నిలిపివేయడంపై తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్.. అంతర్జాతీయంగా న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తోంది. భారత్‌పై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. అయితే, ఈ ప్రయత్నాలు విఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


1960లో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం.. 1965, 1971,1999లో జరిగిన మూడు యుద్ధాల సమయంలోనూ అమలులో ఉంది. అయితే, పహల్గామ్‌లో ఉగ్రదాడిలో అమాయక పౌరుల మరణాలు భారతదేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది.ఈ నేపథ్యంలో సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా సింధూ జలాల ఒప్పందం రద్దు ఒకటి. ఈ నిర్ణయంతో షాక్‌కు గురైన దాయాది.. తమ చెందిన నీటిని ఆపడం లేదా దారి మళ్లించడం యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది.


పాక్ ‘4పాయింట్ల ప్రణాళిక’


ఆర్ధిక సంక్షోభం, తీవ్ర కరువుతో ఇప్పటికే దివాలా తీసిన పాకిస్థాన్‌ నెత్తిన సింధూ జలాల ఒప్పందం రద్దు రూపంలో మరో పిడుగు పడింది. అందుకే ఈ సమస్య పరిష్కారం కోసం న్యాయపరమైన, దౌత్యపరమైన మార్గాలను పాక్ అన్వేషిస్తోంది. పాక్ న్యాయశాఖ మంత్రి అక్వీల్ మాలిక్ మాట్లాడుతూ.. ‘ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు సమక్షంలో జరిగింది. అందుకే ఈ విషయాన్ని వరల్డ్ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లడం సహా కనీసం మూడు మార్గాల్లో న్యాయపరంగా ముందుకెళ్లే ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.


అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) లేదా శాశ్వత తీర్పు న్యాయస్థానం (PCA)లో భారత్‌పై ఫిర్యాదు సహా వియన్నా ఒప్పంద ఉల్లంఘనగా చూపించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ‘న్యాయ సలహాలు పూర్తికావస్తున్నాయి. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ముందుకెళ్లే యోచనలో ఉన్నాం’ అని ఆయన వెల్లడించారు.


అదే సమయంలో, నాల్గో మార్గంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో విషయం ప్రస్తావించడాన్ని కూడా పాకిస్థాన్ పరిశీలిస్తోంది. ‘అన్ని అవకాశాలూ పరిశీలనలో ఉన్నాయి. వీలైనన్ని అంతర్జాతీయ వేదికలను సంప్రదిస్తున్నాం’ అని పాక్ మంత్రి మాలిక్ చెప్పారు.


సింధూ జలాల ఒప్పందం ప్రకారం.. సింధూ నది, దాని ఉపనదులైన సట్లెజ్, బియాస్, రవి, చీనాబ్, జీలం నీటిని భారత్, పాకిస్థాన్ పంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా భారత్‌ సట్లెజ్, బియాస్, రవి నదులు.. పాక్‌ చీనాబ్, జీలం, సింధూ నదుల జలాలను వాడుకుంటున్నాయి. అయితే, ఈ ఒప్పందం భారత్ ఏకపక్షంగా నిలిపివేసిందని, అలా ముగించాలన్న నిబంధన ఒప్పందంలోనే లేదని పాక్ వాదిస్తోంది.


ఐసీజేకు పాక్ వెళ్లే అవకాశమే లేదు


ఐసీజే అధికార పరిధి అనేది దేశాల అనుమతిపైనే ఆధారపడి ఉంటుంది. 2019 సెప్టెంబర్ 27న ICJలో భారత్ దాఖల చేసిన అఫిడ్‌విట్‌లో కొన్ని మినహాయింపులను స్పష్టంగా పేర్కొంది. కామన్‌వెల్త్ సభ్య దేశాలతో సంబంధిత వివాదాలపై ICJ కు అధికార పరిధి ఉండదని పేర్కొంది. అంటే పాకిస్థాన్.., కామన్‌వెల్త్ దేశం అయినందున దీనిపై భారత్‌ను ICJ వద్ద చట్టపరంగా సవాల్ చేయలేదు. సైనిక సంఘర్షణలు, జాతీయ భద్రతా చర్యలు వంటి వాటికి సంబంధించిన వివాదాల్లో ICJకు అధికార పరిధి ఉండదని పేర్కొంది. అలాగే, శాశ్వత తీర్పు న్యాయస్థానం (PCA) కు కూడా ఇలాంటి నిర్ధిష్ట అనుమతి అవసరం. కాబట్టి ఈ ప్రయత్నం కూడా విఫలమైనట్టే.


ప్రపంచ బ్యాంకు పాత్ర:


సింధూ జలాల ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా వ్యవహరించినా.. దానికి న్యాయపరంగా ఏ విధమైన అధికారం ఉండదు. ఇది కేవలం మధ్యవర్తిగా వ్యవహరించగలదు. ఒప్పందం ఉల్లంఘించారా? అన్న దానిపై నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఇది కేవలం సూచనలు మాత్రమే చేయగలదు.


పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యం


పహల్గామ్‌ ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులు, ఒక కశ్మీరీ సహా మొత్తం 26 మంది ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. మత ప్రేరేపితంగా కనిపిస్తున్న ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తోంది. ఈ దాడి వెనుక నిషేధిత పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com