ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందేభారత్ రైళ్లో బీజేపీ బీజేపీకు సీటివ్వలేదని ప్రయాణికుడిపై దాడి

national |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 08:50 PM

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక ప్రయాణికుడు బీజేపీ ఎమ్మెల్యేకు సీటు ఇచ్చేందుకు నిరాకరించిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కుటుంబంతో వచ్చిన ఎమ్మెల్యే.. ఓ ప్రయాణికుడితో సీటు మార్చుకోవాలని అనుకున్నారు. కానీ అతడు మాత్రం అంగీకరించ లేదు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, అభిమానులు సదరు ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ.. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజలకు సాయం చేసే స్థితిలో ఉన్న మీరే.. ఓ ప్రయాణికుడిపై ఇలా దాడి చేయించడం బాగాలేదంటూ కామెంంట్లు చేస్తున్నారు


ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో వందే భారత్ రైలులో చోటుచేసుకుంది. ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ తన భార్య, కుమారుడితో కలిసి తన నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అందుకోసం వందేభారత్ రైళ్లో టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. జూన్ 19వ తేదీన ప్రయాణానికి కూడా సిద్ధం అయ్యారు. అయితే ఎమ్మెల్యేకు కంపార్మెంట్ వెనుక భాగంలో సీటు లభించగా.. ఆయన భార్య, కుమారుడికి మాత్రం ముందు భాగంలో సీటు వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యుల పక్కనే ఎమ్మెల్యేను కూర్చోబెట్టాలని.. అతడి వెంట వచ్చిన వారు సీటు మార్పిడి కోసం ఓ వ్యక్తిని అడిగారు.


 అయితే ఆ వ్యక్తి తాను రిజర్వ్ చేసుకున్న సీటును వదులుకోవడానికి నిరాకరించారు. "ఎమ్మెల్యే ఎక్కడైనా కూర్చోవచ్చు, కానీ నేను నా సీటును వదులుకోను" అని ఆ ప్రయాణికుడు స్పష్టంగా చెప్పాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన ఆయన అనుచరులు.. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న బోగీలోకి చేరి గొడవ చేయడం ప్రారంభించారు. ఎమ్మెల్యే చెబుతున్నా వినవా అంటూ అతడిపై దాడి చేశారు. దీంతో అతడి ముక్కు నుంచి రక్తం కారింది. తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే గొడవ జరిగిన సమయంలో పలువురు దీన్ని వీడియోగా తీయగా.. సోషల్ మీడియాలో పెట్టగా నెట్టింట వైరల్ అయింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ.. ఇది సరైన పద్దతి కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఎమ్మెల్యే అయినంత మాత్రానా.. ప్రయాణికులకు ఇష్టం లేకుండా వారిని సీట్ల నుంచి లేపడం సరికాదంటూ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేయాలి తప్ప, వారిని ఇబ్బంది పెట్టకూడదని వివరిస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ సైతం ఈ ఘటనపై ఝాన్సీలోని ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య, కుమారుడితో రైళ్లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఓ సహ ప్రయాణికుడు తమతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. మరోవైపు బాధితుడు మాత్రం తానేమీ అలా చేయలేదని.. సీటు మార్పిడి చేయనందుకే తనపై దాడి చేసి, పోలీసులతో ఫోన్ చేయించి మరీ బెదిరించారని వివరిస్తున్నాడు. అయితే తాజాగా ఈ ఘటనపై ఝూన్సీ రైల్వే సూపరింటెడెంట్ ఆఫ్ పోలీస్ విపుల్ కుమార్ శ్రీవాస్తవ స్పందించారు. సీసీటీవీ ఫుటేజీ సేకరించి.. దాని ఆధారంగానే తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa