ఇజ్రాయెల్– ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. సోమవారం ఉదయం ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడులు చేపట్టింది. ఇరాన్లోని ఏకంగా ఆరు విమానాశ్రయాలపై విరుచుకుపడింది. ఈ దాడులు ఇరాన్ వైమానిక, క్షిపణి సామర్థ్యాలను నిర్వీర్యం చేయడానికేనని టెల్ అవీవ్ ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ యుద్ధ విమానాలు, క్షిపణి నిల్వ కేంద్రాలు ధ్వంసమైనట్టు తెలిపింది. కెర్మాన్షాహ్, మషహద్, టెహ్రాన్ సహా ఇరాన్లోని ఆరు వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ( IDF ) సోమవారం వెల్లడించాయి. ఇజ్రాయెల్కు శిక్ష తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.
కెర్మాన్షాహ్ ప్రాంతంలోని క్షిపణి నిల్వ, ప్రయోగ కేంద్రాలను 15 పైగా యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన F-14, F-5 యుద్ధ విమానాలు, AH-1 అటాక్ హెలికాప్టర్, ఇంధనం నింపే విమానాలను ధ్వంసం చేశామని తెలిపాయి. ‘‘ఇరాన్ వైమానిక స్థావరాలపై మేము అత్యంత కచ్చితమైన దాడులు చేశాం. రన్వేలు, అండర్గ్రౌండ్ బంకర్లు, రీఫ్యూయలింగ్ వాహనాలు, విమానాలు ధ్వంసమయ్యాయి’’ అని ఐడీఎఫ్ ప్రకటించింది.
టెహ్రాన్లోని మెహ్రాబాద్, తూర్పు ఇరాన్లోని మషహద్, దక్షిణ ఇరాన్లోని డెజ్ఫుల్ వైమానిక స్థావరంపై దాడి చేసినట్టు తెలిపింది. ‘ఈ విమానాశ్రయాల నుంచి విమానాలు టేకాఫ్కు ఇప్పటికే అంతరాయం కలిగింది. ఇరాన్ వైమానికశక్తిని అణచివేసే ప్రయత్నమే ఇది’ అని ఐడీఎఫ్ ట్వీట్ చేసింది. ‘ఇరాన్ వైమానికశక్తిని అణచి, వారి గగనతలంపై ఆధిపత్యం సాధించాలన్నదే మా లక్ష్యం. ఇది ఇజ్రాయేల్ రక్షణకు తప్పనిసరి’ అని తెలిపింది.
తాము ధ్వంసం చేసిన F-14, F-5 విమానాలు పాతవే అయినా ఇవి ఇజ్రాయెల్పై దాడులకు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఐడీఎఫ్ ఆరోపించింది. ఇవే విమానాలు ఇటీవలి కాలంలో హోమ్స్, గాజాపైకి ప్రయోగించిన క్షిపణులకు మద్దతిచ్చాయని సమాచారం. అటు, హర్మూజ్ జలసంధి మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ తీర్మానించింది. జూన్ 13న ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ చేపట్టిన అమెరికా.. మూడు అణు స్థావరాలపై భారీ బంకర్ బస్టర్ బాంబు దాడులు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేశామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అమెరికన్ అధికారులు మాత్రం దీనిపై అప్పుడే అంచనా వేయలేమని చెప్పడం గమనార్హం..
అటు, ఇరాన్కు మిత్రదేశాలు బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం 11వ రోజుకి చేరింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు యూదా సమీప ప్రాంతాల్లో పడ్డట్టు నివేదికలు వచ్చాయి. మరోవైపు, ఇజ్రాయేల్ విమానాలు కొత్త లక్ష్యాలను ఎంచుకుంటున్నాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియా, ప్రపంచ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల, అణు ముప్పు లాంటి అంశాలు ప్రస్తుతం ప్రధాన ఆందోళనగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa