ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం పీఠంపై,,,డీకే మనసులో మాట

national |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 09:32 PM

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం పదవిపై కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గంపెడాశలు పెట్టుకున్నారు. రెండేళ్ల కిందట జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడంతో సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే మధ్య ఆసక్తికర పోరు కొనసాగింది. అయితే, కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించడంతో డీకే డిప్యూటీ సీఎం పదవితో సర్దుకుపోయారు. కానీ, సీఎం కావాలనే కోరిక మాత్రం ఆయనలో అలాగే ఉంది. ముఖ్యమంత్రి పదవిపై తన ప్రయత్నాలు ఎప్పటికైనా ఫలిస్తాయని ఆయన ఆశాభావంతో ఉన్నారు.


తాజాగా, డీకే శివకుమార్ తన రాజకీయ ఆకాంక్షల గురించి మనసులో మాట బయటపెట్టారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ప్రయత్నాలు ఫలించకపోయినా.. నేను బలంగా కోరుకున్న దాని కోసం చేసిన ప్రార్థనలకు సమాధానం దొరక్కుండాపోదు. అయితే రాజకీయాల గురించి చర్చించే సందర్భం ఇది కాదు. రాష్ట్రానికి మంచి జరగాలి’ అని ఆయన అన్నారు. నేరుగా చెప్పకుండానే ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. మల్లికార్జున ఖర్గే తమకు జాతీయ అధ్యక్షుడు అని, ఆయన సూచనల ప్రకారం పార్టీ కోసం పనిచేస్తామని డీకే తెలిపారు.


ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ... రెండు మూడు నెలల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే, ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దీంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. ఆ సమయంలో డీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన (సీఎం)కు అండగా ఉండటం తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు. నేను ఆయనకు మద్దతు ఇవ్వాలి. అధిష్ఠానం ఏం చెబితే అది చేయాలి’ అని ఆయన మీడియాతో అన్నారు. అంటే, సీఎంకు మద్దతు ఇవ్వడం తప్ప తనకు వేరే దారి లేదని ఆయన చెప్పకనే చెప్పారు.


2023 మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ రెండున్నరేళ్ల పాటు సీఎంగా ఉంటారని వార్తలు వచ్చాయి. కొన్ని కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటకు రావడంతో ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. తాను కూడా ఎప్పటికైనా సీఎం అవుతానని డీకే బహిరంగంగానే చెప్పారు. దీంతో కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తరుచూ విమర్శలు గుప్పిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు హామీలు ఇచ్చిందని, సీఎం మార్పు అనేది ఆరో హామీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa