ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు సరికొత్త అస్త్రం.. 80 సెకెన్లలో లాహోర్‌కు చేరుకునే టోవ్డ్ ఆర్టిల్లరీ గన్ సిద్ధం

national |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 08:59 PM

భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా సాగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం గేర్ మార్చింది. తాజాగా, ప్రపంచంలోనే అత్యధిక పరిధి కలిగిన టోవ్డ్ ఆర్టిలరీ గన్‌ను ( ATAGS ) అభివృద్ధి చేసింది. భారత రక్షణ సామర్థ్యానికి ATAGS మరో మైలురాయిగా నిలిచింది. దేశీయంగా అభివృద్ధి చేసిన, అత్యాధునిక లాంగ్-రేంజ్ టోవ్డ్ ఆర్టిల్లరీ గన్ పరిధి, వేగం, వ్యయం, స్థానికత పరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనిని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ ( DRDO), దేశీయ పరిశ్రమలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 2012లోనే దీనిని ప్రారంభించిన డీఆర్డీఓ .. రాజస్థాన్ ఎడారులు నుంచి సియాచిన్ పర్వతాల వరకూ విజయవంతమైన పరీక్షలు నిర్వహించింది.


ఇందులో 85% స్వదేశీయంగా అభివృద్ధి చేసిన భాగాలే కావడం మరో విశేషం. దీని పరిధి 48 కిలోమీటర్లు కాగా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధి కలిగిన టోడ్ ఆర్టిల్లరీ గన్‌గా గుర్తింపు పొందింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి పాకిస్థాన్‌లోని లాహోర్ (దూరం సుమారు 50 కి.మీ)కు 80 సెకెన్లలోనే చేరుకుంటుంది. త్వరలోనే దీని పరిధిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. GPS-గైడెడ్ రామ్‌జెట్ షెల్స్‌తో పరిధిని 80–90 కి.మీలకు పెంచే లక్ష్యంతో DRDO పనిచేస్తోంది. ఇక, లక్ష కోట్ల రూపాయాలతో స్పై విమానాలు, మైన్‌స్వీపర్లను తయారుచేసే ప్రాజెక్ట్‌కు ఇటీవలే ఆమోదం తెలిపింది.


ఈ గన్‌ను 80 సెకెన్లలోనే ఫైర్‌కు సిద్ధం చేయవచ్చు. అలాగే, 85 సెకన్లలోనే రీపొజిషన్‌ చేసుకోవచ్చు. (8×8 ట్రక్‌పై అమర్చి ఉండే ఈ గన్ గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. 2.5 నిమిషాల్లో 10 హై ఎక్స్‌ప్లోజివ్ షెల్స్ లేదా 1 నిమిషంలో 5 షెల్స్‌ను ప్రయోగించగలదు. అలాగే, విదేశీ టోన్డ్ గన్లు ఒక్కో దానికి రూ.35 నుంచి రూ.40 కోట్లు వరకు ఖర్చయితే... కేవలం రూ.15 కోట్లతోనే ATAGS తయారవుతుంది. అధిక సామర్థ్యం, తక్కువ ఖర్చుతో విదేశీ ఆయుధాలకు దీనిని అద్భుత ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌లను భారత స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్ధవంతంగా అడ్డుకున్నాయి.


ఈ ఏడాది మార్చిలో మొత్తం 370 ఆర్టిలరీ గన్స్ కోసం రూ.6,900 కోట్ల విలువైన ఒప్పందాన్ని కేంద్ర రక్షణ శాఖ ఆమోదించింది. తొలి విడత 2027 ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ATAGS కేవలం గన్ మాత్రమే కాదు, ఇది భారత్ సైనిక సామర్ధ్యానికి, స్వదేశీ సాంకేతికత సాధికారతకు ప్రతీక. ఇది రాబోయే రాజుల్లో గగనతలం, పర్వతాల్లో జరిగే భారీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించనుంది. GPS-గైడెడ్ షెల్స్‌తో దీని పరిధి మరింత పెరిగితే, సరిహద్దులను దాటి వెళ్లకుండానే శత్రువుపై దాడిచేయవచ్చు. ఆత్మ నిర్మర్ భారత్‌లో భాగంగా రక్షణ ఉత్పత్తులను స్వదేశీయంగా తయారుచేసుకుని.. పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa