హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మక కేంద్రాల్లో అమర్నాథ్ ఒకటి. అయితే కోరుకున్న ప్రతి ఒక్కరు అమర్నాథ్ యాత్ర చేయలేరు. ఈ యాత్ర పూర్తి చేయడం పెద్ద సాహసమే. అందుకు కారణం అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు. అమర్నాథ్ యాత్ర సమయానికి కుండపోత వానలు కురిసే వాతావరణం నెలకొని ఉంటుంది. దీంతో యాత్ర పూర్తి చేయడం కత్తి మీద సాములానే ఉంటుంది. ఇక ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. అయితే తాజాగా యాత్రలో అపశృతి చోటు చేసుకుని ఒకరు మరణించారు. పదిమంది గాయపడ్డారు. అసలేం జరిగిందంటే..
జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలు అమర్నాథ్ యాత్రకు అడ్డంకిగా మారాయి. దీంతో అమర్నాథ్ యాత్ర కొనసాగే మార్గంలో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కుండపోత వానల కారణంగా బాల్టాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఒకరు చనిపోగా.. 10 మంది యాత్రికులు గాయపడ్డారు. ఒక్కసారిగా వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తడంతో యాత్రికులు వరదల్లో చిక్కుకున్నారు.
అయితే యాత్ర కొనసాగే మార్గంలోని బాల్టాల్, పహల్గామ్ ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. ప్రమాదం గురించి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..బాల్టాల్ మార్గంలో రైల్పత్రి సమీపంలోని జడ్ మలుపు వద్ద.. పర్వతం నుంచి యాత్ర మార్గంలోకి అకస్మాత్తుగా వర్షపు నీరు రావడం వల్ల కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారని.. మరో పది మంది యాత్రికులకు గాయాలయ్యాయని వెల్లడించారు. మరణించిన మహిళను రాజస్థాన్కు చెందిన సోనా బాయి(55)గా గుర్తించారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయిందని అధికారులు తెలిపారు. గాయపడిన వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని.. వారి ఆరోగ్యం నిలకడానే ఉందని వైద్యులు తెలిపారు.
అమర్నాథ్ యాత్రకు ముఖ్య అడ్డంకి అకస్మాత్తుగా మారే వాతావరణం. రెండేళ్ల క్రితం అనగా 2023లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం, కొండచరియలు విరిగిపడటం కారణంగా యాత్రను చాలాసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సారి కూడా భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్ర మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా భక్తులు బాబా బర్ఫానీని సందర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అలానే జులై 1 నుంచి ఆగస్టు 10 వరకు అమర్నాథ్ యాత్ర మార్గాన్ని ‘నో ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించారు. అంటే ఈనెల రోజులు ఈ ప్రాంతంలో డ్రోన్లు, యూవీఏలు, బెలూన్లు ఎగరడం నిషేధం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa