ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 07:04 PM

ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచగా.. కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. ఆగస్ట్ ఒకటో తేదీ వరకూ మిథున్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.


మరోవైపు ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరిచేముందు మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడ గవర్నమెంట్ ఆస్పత్రిలో బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేలటంతో.. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా మిథున్ రెడ్డి అరెస్ట్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం 29 కారణాలను కోర్టుకు నివేదించింది. అలాగే ఏయే సెక్షన్ల కింద కేసు నమోదయ్యిందనే వివరాలు తెలియజేసింది.


ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో గుంటూరు సబ్ జైలుకు రిమాండ్‌కు ఇవ్వాలని సిట్ తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరారు. అయితే మిథున్ రెడ్డి ఎంపీ అని, ప్యానెల్ స్పీకర్‌గానూ పనిచేశారని.. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ గురించి లోక్‌సభ స్పీకర్‌కు కనీసం సమాచారం ఇవ్వలేదని మిథున్ రెడ్డి తరుఫు న్యాయవాదులు వాదించారు. ఒకవేళ రిమాండ్ విధించాలనుకుంటే నెల్లూరు జైలుకు ఇవ్వాలని.. అలాగే ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు.. మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రికి తరలిస్తున్నారు.


మరోవైపు మిథున్ రెడ్డి పట్ల ఏపీ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆయన తండ్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్‌కు సఖ్యతగా ఉంటారనే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలోనూ మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని.. ఎయిర్‌పోర్టులో మేనేజర్‌ను కొట్టాడంటూ కేసులు పెట్టారని పెద్దిరెడ్డి అన్నారు. అయితే ఆ కేసు నిలబడలేదన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇప్పుడు పెట్టిన కేసు కూడా నిలబడదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుసరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa