ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ డ్యామ్‌, భారత్‌కు ఎలాంటి ముప్పు

international |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 08:30 PM

ఛాన్స్ దొరికితే భారత్‌ను ఇబ్బందులు పెట్టాలని చూసే చైనా మరో కుటిల పన్నాగానికి తెరలేపింది. ‘నీటి యుద్ధమే’ లక్ష్యంగా టిబెట్ సరిహద్దులో భారీ డ్యామ్ నిర్మాణం తలపెట్టింది. అది కూడా బ్రహ్మపుత్రా నదిపై. అంతర్జాతీయ జల ఒప్పందాలను తుంగలో తొక్కి.. భారత్‌కు వచ్చే నీళ్లను అడ్డుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై భారత్ అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ.. చైనా బేఖాతరు చేస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే, భారత్‌ను ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలని చైనా కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.


మన దేశానికి సరిహద్దుగా ఉన్న ఆగ్నేయ టిబెట్‌లో బ్రహ్మపుత్ర నది (టిబెటన్‌లో యార్లుంగ్ త్సాంగ్పో)పై ఒక భారీ డ్యామ్ నిర్మాణాన్ని మొదలుపెట్టింది చైనా. ఈ డ్యామ్ శంకుస్థాపన కార్యక్రమానికి చైనా ప్రీమియర్ (ప్రధానమంత్రి) లీ కియాంగ్ హాజరు అయ్యారంటే, డ్రాగన్ దీనికి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.


2023 డిసెంబర్‌లోనే ఈ ప్రాజెక్టును ఆమోదించిన చైనా.. తాజాగా శంకుస్థాపన చేసింది. కర్బన తటస్థ లక్ష్యాలను సాధించడం కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినట్లు చైనా చెబుతున్నప్పటికీ.. టిబెట్ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసి, ఆ ప్రాంతంలో తమ పట్టు నిలుపుకోవాలని డ్రాగన్ భావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు వ్యూహాత్మకంగా భారత్‌ను ఇరుకున పెట్టేలా ఈ డ్యామ్ నిర్మాణం ప్రారంభించిందని చెబుతున్నారు. భారత్‌తో ఉద్రిక్తతలు, యుద్ధం తరహా పరిస్థితులు తలెత్తితే.. ఈ డ్యామ్‌ను పేల్చేసి ఆకస్మిక వరదలతో భారత్‌కు నష్టం చేయడం చైనా కుటిల యుక్తి అని అభిప్రాయపడుతున్నారు.


ఈ డ్యామ్ ఎక్కడ నిర్మిస్తున్నారు?


భారత సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో.. టిబెట్‌లోని నైంగ్చి ప్రాంతంలో చైనా ఈ డ్యామ్‌ను నిర్మిస్తోంది. ఈ డ్యామ్‌పై ఏర్పాటు చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల (జల విద్యుత్ కేంద్రాలు) నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ముఖ్యంగా టిబెట్‌ అవసరాలకు వినియోగించుకున్న తర్వాత మిగిలిన కరెంటును ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్‌హువా పేర్కొంది.


భారీ వ్యయంతో డ్యామ్ నిర్మాణం


ఈ డ్యామ్ నిర్మాణాన్ని చైనా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సుమారు 1.2 ట్రిలియన్ యువాన్లు (సుమారు 167.1 బిలియన్ డాలర్లు) అంటే భారత కరెన్సీలో రూ.14.5 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు జలవిద్యుత్ కేంద్రాలు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. చైనాలోని యాంగ్ త్సే నదిపై ఉన్న రికార్డు సృష్టించిన ‘త్రీ గోర్జెజ్ డ్యామ్’ కంటే అధిక విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదని చైనా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ డ్యామ్ నిర్మాణం.. బ్రహ్మపుత్ర నది ప్రవహించే దిగువ దేశాలైన భారత్, బంగ్లాదేశ్‌లకు ఇబ్బందులు తప్పకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నది ప్రవాహంతో పాటు పర్యావరణ వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.


భారత్ అభ్యంతరాలకు చైనా రియాక్షన్ ఏంటి?


బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై భారత్ ఈ ఏడాది జనవరిలోనే స్పందించింది. దీనిపై తమ ఆందోళనలను ఆ దేశానికి తెలియజేసింది. భారత ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బ్రహ్మపుత్ర నదిపై ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల కారణంగా.. దిగువన ఉన్న ప్రాంతాలకు నీరు లేకుండా చేసి.. హాని కలిగించవద్దని చైనాకు భారత్ విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది.


భారత్ ఆందోళనలపై స్పందించిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ.. ఈ ప్రాజెక్టు కారణంగా దిగువన ఉన్న దేశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని వివరణ ఇచ్చింది. అంతేకాకుండా బ్రహ్మపుత్ర నదికి దిగువన ఉన్న దేశాలతో ఎప్పటికప్పుడు సంభాషణను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.


పర్యావరణపరంగా ఆందోళనలు


బ్రహ్మపుత్ర నదిలో నీటి ప్రవాహం, దాని వాటా గురించి భారత్, బంగ్లాదేశ్‌ల ఆందోళనలు ఇలా ఉండగా.. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణవేత్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన టిబెటన్ పీఠభూమిలో ఇలాంటి భారీ ప్రాజెక్టులను నిర్మిస్తే.. పర్యావరణ పరంగా కోలుకోలేని మార్పులు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రాంతంలో భూకంపాలూ సంభవిచ్చవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అరుణాచల్ సీఎం ఆందోళన


చైనా నిర్మించే భారీ డ్యామ్‌పై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఒక జల బాంబుగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే.. ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనుగడకు ప్రమాదకరమని చెప్పారు. చైనాను మనం నమ్మలేమని.. వారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదని పెమా ఖండు ఆవేదన వ్యక్తం చేశారు. చైనా సైనిక ముప్పును పక్కన పెడితే.. ఈ డ్యామ్ నిర్మాణం అంతకంటే చాలా పెద్ద సమస్యగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది గిరిజనులకు, ప్రజల జీవనోపాధికి ముప్పును కలిగిస్తుందని పేర్కొన్నారు. డ్యామ్ నిర్మాణం పూర్తైన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేస్తే.. మన సియాంగ్ ప్రాంతం మొత్తం నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


సరిహద్దుల్లో సైనిక అలజడి సృష్టించి.. తరచూ కవ్వింపులకు పాల్పడుతోంది చైనా. దీనికి తోడు తరచూ భారత్‌లోని భూభాగాలను తమ భూభాగాలని చెప్పుకుంటూ కవ్వింపులకు పాల్పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్, లఢఖ్ విషయంలో తరచూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ, మ్యాప్‌లు విడుదల చేస్తోంది. ఫలితంగా భారత్, చైనా మధ్య వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సరిహద్దు ప్రాంతం.. తరచూ కవ్వింపులకు, ఘర్షణలకు, ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. దీంతో రెండు దేశాలు భారీగా సైనికులను సరిహద్దుల్లో మోహరించాయి. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ఇప్పుడు చైనా చేపట్టిన ఈ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం.. రెండు దేశాల మధ్య సంబంధాలపై, ప్రాంతీయ పర్యావరణ సమతౌల్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సామాన్యుల్లోనూ ఆందోళన నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa