ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్గిల్ విజయ్ దివాస్: రుద్ర పేరుతో ఆల్-ఆర్మ్ బ్రిగేడ్ల ఏర్పాటు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 07:46 PM

భారతదేశానికి గర్వకారణమైన కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా.. భారత సైన్యంలో కీలకమైన సంస్కరణలకు నాంది పలుకుతూ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కోవడానికి, సైనిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి 'రుద్ర' పేరుతో కొత్త ఆల్-ఆర్మ్స్ బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు.


ఈ 'రుద్ర' బ్రిగేడ్‌లు సాధారణ బ్రిగేడ్‌ల మాదిరిగా కాకుండా.. అత్యంత సమగ్రమైన, స్వీయ-నిర్భరమైన యూనిట్‌లుగా రూపొందించనున్నారు. వీటిలో కాల్బలం, మెకనైజ్డ్ పదాతిదళం, ఆర్మర్డ్ యూనిట్లు, ఫిరంగి దళాలు, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వాహనాలు (డ్రోన్‌లు), లాజిస్టిక్స్, యుద్ధ సహాయక విభాగాలు సమన్వయంతో పని చేస్తాయి. దీనివల్ల ఒకే బ్రిగేడ్ వివిధ రకాల యుద్ధ పరిస్థితులలో త్వరితగతిన స్పందించడానికి, సమర్థవంతంగా పని చేయడానికి వీలు కల్పిస్తుంది. గతంలో వేర్వేరు విభాగాల మధ్య సమన్వయం కోసం సమయం పట్టేది. కానీ 'రుద్ర'తో ఆ జాప్యం తగ్గుతుంది. అంతేకాకుండా రెండు పదాతిదళ బ్రిగేడ్‌లను ఇప్పటికే రుద్ర బ్రిగేడ్‌లుగా మార్చినట్లు వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు సైన్యంలో ఆర్మ్-స్పెసిఫిక్ బ్రిగేడ్లు మాత్రమే ఉండేవని.. కానీ రుద్రు ఆర్మ్స్ మిశ్రమంగా ఉంటుందని వివించారు.


 ఈ విషయాన్ని నేరుగా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదియే వెల్లడించారు. అలాగే చురుకైన, ప్రాణాంతమైన ప్రత్యేక దళాల యూనిట్లు, భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లు.. సరిహద్దుల్లోనే శత్రువులను దిగ్ర్భాంతికి గురి చేయడానికి స్థాపించబడ్డాయని గుర్తు చేశారు. ప్రతి పదాతిదళ బెటాలియన్‌లో ఇప్పుడు డ్రోన్ ప్లాటూన్‌లు ఉన్నాయని చెప్పారు. అయితే ఫిరంగిదళం దివ్యస్త్ర బ్యాటరీలు, లోయిటర్ మునిషన్ బ్యాటరీల ద్వారా దాని మందగుండు సామగ్రిని అనేక రెట్లు పెంచుకుందని చెప్పారు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ స్వదేశీ క్షిపణి వ్యవస్థలతో అమర్చ బడుతోందన్నారు. ఇవి మన బలగాలను మరింత శక్తిమంతంగా తయారు చేస్తున్నాయని వెల్లడించారు.


ఈ కొత్త నిర్మాణంతో పాటు సరిహద్దులో శత్రువులకు షాక్ ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ప్రత్యేక దళాలను కూడా ఏర్పాటు చేసినట్లు జనరల్ ద్వివేది వెల్లడించారు. ఈ చర్యలు భారత సైన్యం యొక్క పోరాట శక్తిని అనేక రెట్లు పెంచుతాయని ధీమా వ్యక్తం చేశారు. "వృద్ది చెందిన భారత్ 2047" లక్ష్యాన్ని నెరవేర్చడానికి సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. సైనిక సన్నద్ధతతో పాటు సరిహద్దు ప్రాంతాలలో.. ముఖ్యంగా లడఖ్ వంటి ప్రాంతాలలో అభివృద్ధి పనులకు కూడా సైన్యం తోడ్పడుతోందని పేర్కొన్నారు. ఇది దేశ నిర్మాణంలో సైన్యం పాత్రను తెలియజేస్తుందని జనరల్ ద్వివేది వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa