ప్రపంచంలోని అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారిర రికార్డు సృష్టించారు. మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ విడుదల చేసిన తాజా సర్వే ప్రకారం.. ప్రధాని మోదీ మరోసారి ప్రపంచ నాయకులలో అత్యధిక ఆమోద రేటింగ్ను పొందారు. 75 శాతం భారీ ఆమోద రేటింగ్తో ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యంత విశ్వసనీయమైన నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. భారత్ సురక్షితమైన చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.
ఈ ఏడాది జులై 4వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది. అందులో ప్రపంచంలోని ప్రధాన నాయకుల పేర్లను ఇచ్చి.. అత్యంత విశ్వసనీయత కల్గిన నాయకుడిని ఎంచుకోమంటారు. కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిలియన్ల మందీ ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే ఈ జాబితాలో ప్రధాని మోదీ గణనీయమైన తేడాతో ఇతర ప్రపంచ నాయకుల కంటే ముందున్నారు. ముఖ్యంగా 75 శాతం మద్దతుతో ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవగా.. 57 శాతంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ రెండో స్థానంలో నిలిచారు.
ఇక మూడో స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి, నాలుగో స్థానంలో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీలు నిలిచారు. అయితే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మాత్రం ఎవరూ ఊహించనంత దిగువ స్థాయికి పడిపోయారు. కేవలం 44 శాతం మంది మద్దతుతో 8వ స్థానంలో నిలిచి అందరికీ గట్టి షాక్ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ కల్గిన నేతగా మోదీ ఇప్పటికే అనేక మార్లు తొలి స్థానం దక్కించుకున్నారు. ముఖ్యంగా 2021 సెప్టెంబర్లో ఇదే మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీకి 70 శాతం మంది మద్దతు పలకగా.. నెంబర్ వన్గా నిలిచారు. అలాగే 2022 ప్రారంభంలో కూడా సర్వే చేయగా.. 71 శాతంతో రికార్డు సృష్టించారు.
ఆ తర్వాత ఏప్రిల్, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో కూడా సర్వేలు నిర్వహించగా.. 76 శాతం మద్దతుతో మూడు సార్లు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా రికార్డు నెలకొల్పారు. 2024 ఫిబ్రవరిలోనే చేసిన సర్వేలో ఏకంగా 78 శాతంతో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఇక తాజాగా చేసిన సర్వేలో 75 శాతంతో మళ్లీ నెంబర్ వన్గా నిలిచి తన స్థానాన్ని నిలుపుకున్నారు. ప్రధాని మోదీకి ఈ స్థానం లభించడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, దేశ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రభావాన్ని పెంచడంలో ఆయన పాత్ర వంటివి ఈ ప్రజాదరణకు కారణాలుగా నిలుస్తున్నాయన్నారు.
దేశ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత, సుపరిపాలన అందించాలనే ఆయన దృక్పథం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయని చెబుతున్నారు. అలాగే కఠినమైన సవాళ్లు ఎదురైనప్పుడు కూడా ఆయన నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసం చెక్కుచెదరలేదని ఈ సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు, ఆర్థిక సవాళ్లు తలెత్తుతున్న ప్రస్తుత తరుణంలో ఒక నాయకుడు ఇంతటి స్థిరమైన, ఉన్నతమైన ఆమోద రేటింగ్ను పొందడం అసాధారణం కాగా.. మోదీ తన స్థానాన్ని నిలుపుకుని అందరు మెచ్చిన నేతగా నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa