ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో దసరా నవరాత్రి వేడుకలకు ముహూర్తం ఫిక్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 11:32 PM

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకూ విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది 11 రోజుల పాటు దసరా మహోత్సవాలు జరుగుతాయని దుర్గ గుడి ఈవో శీనానాయక్ తెలిపారు. మూలా నక్షత్రం సెప్టెంబర్ 29 (సోమవారం) వచ్చిందని.. ఆ రోజున సీఎం నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. అక్టోబర్ రెండో తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో సామాన్యులకు పెద్దపీట వేస్తూ అందరికీ దుర్గమ్మ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి అలంకారాలు


సెప్టెంబర్ 22- బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం


సెప్టెంబర్ 23- గాయత్రి దేవి అలకారం


సెప్టెంబర్ 24 - అన్నపూర్ణ దేవి అలంకారం


సెప్టెంబర్ 25 - కాత్యాయిని దేవి అలంకారం


సెప్టెంబర్ 26 - మహాలక్ష్మీ దేవి అలంకారం


సెప్టెంబర్ 27 - లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం


సెప్టెంబర్ 28 - మహా చండీ దేవి అలంకారం


సెప్టెంబర్ 29 - సరస్వతి దేవి అలంకారం


సెప్టెంబర్ 30- దుర్గా దేవి అలంకారం


అక్టోబర్ 1- మహిషాసుర మర్దిని అలంకారం


అక్టోబర్ 2 - రాజరాజేశ్వరి దేవి అలంకారం


మరోవైపు దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారు 11 రోజులు 11 దివ్య అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారని అధికారులు తెలిపారు. ప్రతి రోజు నగరోత్సవాలు జరుగుతాయని.. సమన్వయంతో పనిచేసి దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని దుర్గ గుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. క్యూలైన్లు, లైటింగ్, తాగునీటి సౌకర్యం వంటి సదుపాయాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. వేడుకలకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు అందరికీ అమ్మవారి లడ్డూ ప్రసాదం అందేలా చర్యలు తీసుకోవాలని దుర్గమ్మ భక్తులు కోరుతున్నారు.


నవరాత్రి ఉత్సవాల వేళ వీఐపీ దర్శనాల కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనం వేళలు పక్కాగా అమలు చేయాలని కోరుతున్నారు. దుర్గాఘాట్‌లో సరైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. భవానీ భక్తులు స్నానాలు ఆచరించేందుకు వచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa