ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింధు జలాల ఒప్పందం నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదం అన్న ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 06:45 PM

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో నెహ్రూ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని, తద్వారా దేశ రైతాంగానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, "నెహ్రూ దేశాన్ని ఒకసారి కాదు, రెండుసార్లు విభజించారు. మొదట రాడ్‌క్లిఫ్ లైన్‌తో, ఆ తర్వాత సింధు జలాల ఒప్పందంతో దేశానికి నష్టం చేకూర్చారు" అని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం కింద సింధు నది జలాల్లో 80 శాతం నీటిని పాకిస్థాన్‌కు ధారాదత్తం చేశారని ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత తన కార్యదర్శి వద్ద ఈ ఒప్పందం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదని నెహ్రూ స్వయంగా తన తప్పును అంగీకరించారని మోదీ తెలిపారు. ఈ ఒప్పందం పూర్తిగా రైతు వ్యతిరేకమని ఆయన అభివర్ణించారు.రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును కాలరాసేందుకు నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ చేశారని మోదీ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంచారని విమర్శించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేయలేదని, తమ ప్రభుత్వం వచ్చాకే వారి అభివృద్ధి మొదలైందని అన్నారు. ఎన్డీయే హయాంలో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa