ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్ట్ 25వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 07:19 PM

రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలోని పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా అందించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేపథ్యంలో.. నాదెండ్ల మనోహర్ శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..టెక్నాలజీ వినియోగించి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆగస్ట్ 25వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. మొత్తం నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఆగస్ట్ 25వ తేదీన తొమ్మిది జిల్లాలలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 15వ తేదీ వరకూ మొత్తం నాలుగు దశల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి వివరించారు.


ఆగస్ట్ 25న విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆగస్ట్ 30వ తేదీ నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో.. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో.. సెప్టెంబర్ 15 నుంచి మిగతా జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.


మరోవైపు రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా అందించనున్నారు. ఇంటి వద్దకే వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే బియ్యం కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న 6.70 లక్షల మందికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే మండలాలకు చేరుకున్నాయని.. క్యూఆర్ కోడ్‌తో సహా సాంకేతికతను వినియోగించి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించామన్నారు. ఈ పోస్ యంత్రాలలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు స్వైప్ చేసి సరుకులు తీసుకోవచ్చని సూచించారు. అలాగే రేషన్ సరుకుల పంపిణీ సమాచారాన్ని కేంద్ర సర్వర్‌కు ఎప్పటికప్పుడు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.


మరోవైపు వృద్ధులు, దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో రేషన్ పంపిణీ చేస్తారు. అయితే ముందు నెల 25వ తేదీ నుంచే వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలోని 16.70 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇలా రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలాగే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల సాయంతో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa