ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులకు ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 07:24 PM

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.13000 చొప్పున విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసే కార్యక్రమానికి ఈ ఏడాది జూన్ నెలలో శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద రెండు దఫాలుగా తొలి విడత నిధులను జమ చేసింది. అర్హులై ఉండి.. వివిధ కారణాలతో తల్లికి వందనం పథకం లబ్ధి అందని వారికి దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించగా.. తాజాగా తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులను ఆమోదించిన నారా లోకేష్.. తల్లికి వందనం పెండింగ్ నిధులు రూ.325 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని నారా లోకేష్ ఆదేశించారు.


మరోవైపు ఇక నుంచి ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని నారా లోకేష్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే అనవసరమైన ట్రైనింగ్ పేరుతో ఉపాధ్యాయుల సమయం వృథా చేయవద్దని నారా లోకేష్ అధికారులకు సూచించారు. విద్యారంగానికి సంబంధించి ఇతర రాష్ట్రాలల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలు అధ్యయనం చేసి.. ఉత్తమ ప్రీస్కూల్‌ పాలసీ సిద్ధం చేయాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. అలాగే మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్స్‌, స్పోర్ట్స్‌ ఫేర్‌లు నిర్వహించాలని ఆదేశించారు.


మరోవైపు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలపైనా నారా లోకేష్ చర్చించారు. వీటి నిర్మాణం కోసం దాతల సహకారంతో భూసేకరణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ శాసనసభలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు అసెంబ్లీ స్పీకర్ అనుమతితో ప్రతి నియోజకవర్గం నుంచి విద్యార్థులను ఎంపిక చేయాలని నారా లోకేష్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ఏలూరులో ప్రభుత్వం ఆధునీకరించిన సైన్స్ సెంటర్లను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa