ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు .. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 07:31 PM

రాష్ట్రంలో ఆరోగ్య రంగం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలను అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఆస్పత్రులలో మౌలిక వసతులను మెరుగుపరిచి.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న రోగుల సంఖ్య, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ)లలో వసతులను మెరుగుపరచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని తొమ్మిది సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అదనపు వసతుల కల్పన కోసం రూ.51.75 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది. కళ్యాణదుర్గం, చెన్నూరు, పత్తికొండ, చోడవరం, కంకిపాడు, ఆమదాలవలస, పొన్నూరు, కనిగిరి, ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతులను ఈ నిధుల సాయంతో అభివృద్ధి చేయనున్నారు.


ఈ కేంద్రాలలో రోగుల తాకిడి అధికంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ కేంద్రాలలో అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలను దృష్టిలో పెట్టుకుని ఓపీ, రక్తపరీక్ష కేంద్రాలు, డయాగ్నోస్టిక్ బ్లాకులు, అదనపు వార్డులు, ప్రసూతి గదుల వంటి అదనపు వసతులు కల్పిస్తారు. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 173 సామాజిక ఆరోగ్య కేంద్రాలలోనూ అవసరాలకు తగిన విధంగా సౌకర్యాలు మెరుగుపరుస్తామని వెల్లడించారు.


మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. అల్లూరి జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్తగా 56 పోస్టుల మంజూరు చేయనున్నా్రు. గురువారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సామర్థ్యం 50 పడకలు కాగా.. ఇందులో అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్రంలోని నాలుగు విలీన మండలాల ప్రజలతో పాటుగా పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రోగులూ వస్తుంటారు. ఈ నేపథ్యంలో చింతూరు ఆస్పత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. దీంతో మరిన్ని మెరుగైన సేవలు ఈ ప్రాంతవాసులకు అందుబాటులోకి వస్తాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa