ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే మండలాలకు చేరుకున్నాయి. సాంకేతిక హంగులతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించారు.తహసీల్దార్ కార్యాలయాలకు స్మార్ట్ రేషన్ కార్డులను చేరవేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయాలకు తరలిస్తారు. ఆపై సిబ్బంది ద్వారా ఆగస్ట్ 25 నుంచి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. స్మార్ట్ రేషన్ కార్డుల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ పంపిణీలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్ట్ 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుండటంతో.. సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేపథ్యంలో రేషన్ దుకాణాల్లో స్మార్ట్ ఈ-పోస్ మిషన్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఈ-పోస్ మెషీన్లో స్వైప్ చేస్తే కార్డుదారుడి వివరాలు రేషన్ డీలరుకు తెలుస్తాయి. దీంతో గతంలోలాగా సర్వర్ సమస్యలు ఉండవని అధికారులు చెప్తున్నారు. అలాగే సిమ్, వైఫై, హాట్స్పాట్లతో పాటుగా, బ్లూ టూత్, టచ్ స్క్రీన్ వంటి అడ్వాన్స్డ్, ఆండ్రాయిడ్ టెక్నాలజీ సాయంతో ఈ పోస్ యంత్రాలు పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా కూడా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వేలిముద్ర పడకపోతే ఈ- పోస్ మెషీన్లో ఉన్న కెమెరా సాయంతో ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు.
ఇప్పటి వరకూ రేషన్ షాపులలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే వేలిముద్ర తప్పనిసరి. అలాగే మారుమూల ప్రాంతాలలో సర్వర్ సమస్యలు వేధించేవి. వేలిముద్ర పడక రేషన్ షాపుల వద్ద క్యూ కట్టే పరిస్థితులు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెస్తోంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో మొదట బయోమెట్రిక్ తీసుకుంటారు. ఒకవేళ బయోమెట్రిక్ పడకపోతే ఐరిస్ స్కాన్ చేస్తారు. అక్కడ కూడా ఇబ్బందులు వస్తే స్మార్ట్ రేషన్ కార్డు స్వైపింగ్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు. మొత్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు, ఈ - పోస్ యంత్రాల ఎంట్రీతో రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి.
మరోవైపు మే నెల ఏడో తేదీ నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డులతో పాటుగా మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం చెప్తోంది. ఇక కొత్తగా రాష్ట్రంలోని 9 లక్షల మందికిపైగా ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఆగస్ట్ 25 నుంచి 31 వరకూ ఉచితంగా అందించనుంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల మీద పొలిటికల్ నేతల ఫోటోలు ఉండవు. కేవలం కుటుంబసభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయని అధికారులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa